Shikhar Dhawan: పహల్గామ్ ఉగ్రదాడిపై ధావన్, అఫ్రిది మధ్య ట్వీట్ వార్

- భారత ఆర్మీపై అఫ్రిది వ్యాఖ్యలకు ధావన్ కౌంటర్
- కార్గిల్ లో ఓడించాం గుర్తులేదా అంటూ ట్వీట్
- గెలుపు ఓటములు పక్కన పెట్టు.. టీ తాగుదాం రమ్మంటూ ఆఫ్రిది జవాబు
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, షాహిద్ అఫ్రిది మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది. ఉగ్రదాడి ఘటనను ప్రస్తావిస్తూ భారత సైన్యంపై అఫ్రిది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ధావన్ ఘాటుగా బదులిచ్చారు.
ఇటీవల పాకిస్థాన్ టీవీ ఛానెల్లో అఫ్రిది మాట్లాడుతూ.. భారత భద్రతా దళాల వైఫల్యం వల్లే దాడి జరిగిందని ఆరోపించారు. భారత సైన్యం సామర్థ్యాన్ని ప్రశ్నించారు. కశ్మీర్లో 8 లక్షల మంది సైనికులు ఉన్నా ప్రజలకు భద్రత కల్పించలేకపోయారని విమర్శించారు. దీనిని బట్టి వారు అసమర్థులని అర్థమవుతోందంటూ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై శిఖర్ ధావన్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. "కార్గిల్లో ఓడించాం గుర్తులేదా? ఇప్పటికే చాలా దిగజారారు, ఇంకా ఎంత దిగజారిపోతారు? అనవసర వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశాభివృద్ధిపై దృష్టి పెట్టండి. మా భారత సైన్యం పట్ల మాకు చాలా గర్వంగా ఉంది. భారత్ మాతా కీ జై! జై హింద్!" అని ధావన్ హిందీలో ట్వీట్ చేశారు. ధావన్ ట్వీట్ కు అఫ్రిది స్పందిస్తూ, "గెలుపోటములను పక్కన పెట్టు, రా శిఖర్ నీకు ఛాయ్ తాగిస్తాను" అని బదులిచ్చారు.