స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి!

Indian Stock Market Bloodbath Rs 8 Lakh Crore Wiped Out in One Day
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు
  • సెన్సెక్స్ 1677, నిఫ్టీ 517 పాయింట్ల నష్టం
  • పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. బుధవారం ట్రేడింగ్‌లో సూచీలు భారీగా కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే సుమారు రూ. 8 లక్షల కోట్లు ఆవిరైంది. అమ్మకాల సునామీ కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 శాతానికి పైగా నష్టపోయాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 1,677 పాయింట్లు నష్టపోయి 76,503.60 వద్ద ముగిసింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 517 పాయింట్లు పతనమై 23,882.05 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ సహా అన్ని రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. హార్ముజ్ జలసంధిలో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు 5 శాతం పెరిగి 78 డాలర్లకు చేరుకుంది.

ఈ పరిణామాలు భారత కరెన్సీపైనా తీవ్ర ప్రభావం చూపాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.50 స్థాయిని దాటి బలహీనపడింది. పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇటీవలి లాభాలన్నీ ఈ ఒక్క సెషన్‌లోనే తుడిచిపెట్టుకుపోయాయని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Indian Stock Market
BSE Sensex
NSE Nifty
Donald Trump
US Iran tensions
Crude oil prices

More Telugu News