Pawan Kalyan: మా అబ్బాయికి పిచ్చి కలలు వస్తుంటే సైకియాట్రిస్ట్ కు చూపించాం... మధుసూదన్ కొడుకు పరిస్థితి బాధాకరం: పవన్ కల్యాణ్

- పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్
- దాడిలో మరణించిన మధుసూదన రావు కుమారుడి మానసిక స్థితిపై తీవ్ర ఆవేదన
- తన కుమారుడి అనుభవంతో పోల్చి పరిస్థితి తీవ్రతను వివరణ
- కళ్లెదుటే తండ్రి హత్యను చూసిన పదేళ్ల బాలుడి వేదన వర్ణనాతీతమని వెల్లడి
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ రావుకు ఇవాళ జనసేన పార్టీ నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన, తండ్రిని పోగొట్టుకుని మధుసూదన్ కుమారుడు అనుభవిస్తున్న మానసిక వేదనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కళ్లెదుటే తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని చూసిన పదేళ్ల బాలుడి పరిస్థితిని తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తుచేసుకున్నారు. "మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో నా కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయినా కూడా, కింద పడిపోయినట్లు కలలు వస్తున్నాయని భయపడుతున్నాడు. దీనికే మేము ఆందోళన చెంది సైకియాట్రిస్ట్ కు చూపిస్తున్నాం" అని తెలిపారు.
ఈ చిన్న సంఘటనకే తన కుమారుడు భయపడుతుంటే, కళ్ల ముందే తండ్రిని అత్యంత దారుణంగా ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే చూసిన పదేళ్ల బాలుడు మధుసూదన్ రావు కుమారుడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని పవన్ అన్నారు. ఆ పసి బాలుడు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతమని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతిచెందిన క్రియాశీలక జనసైనికుడు మధుసూదన రావు గారి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటిస్తున్నానని పవన్ తెలిపారు. ఇది ఆర్ధిక సాయంలా కాకుండా వారి కుటుంబానికి మేమున్నాం అనే భరోసా ఇస్తుందని భావిస్తూ, భవిష్యత్తులో అన్ని విధాలుగా ఎవరి కుటుంబానికి అండగా ఉంటాం అని వెల్లడించారు.