Vinod Kumar: కశ్మీర్ ప్రజలకు వాళ్లు తిండి లేకుండా చేశారు: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆగ్రహం

- ఫిబ్రవరి నుంచి జులై వరకు కశ్మీరీలకు ధనార్జనకు అవకాశం ఉంటుందని వెల్లడి
- దాడి కారణంగా పర్యాటకులు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్న వినోద్ కుమార్
- పర్యాటక రంగంపై వేలాది కుటుంబాలు బ్రతుకుతున్నాయని వ్యాఖ్య
కశ్మీర్ ప్రజలకు ఇది అత్యంత కీలకమైన సమయమని, ధనార్జనకు ఈ సీజనే అనుకూలమని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ పేర్కొన్నారు. కశ్మీర్లో శీతాకాలం మొత్తం ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు. ఫిబ్రవరి చివరి నుంచి జులై వరకు పర్యాటక రంగం ద్వారా మాత్రమే కశ్మీరీలు డబ్బు సంపాదించగలరని తెలిపారు.
ప్రస్తుతం ఉగ్రవాదులు చేసిన దాడి కారణంగా పర్యాటకులు జమ్ముకశ్మీర్కు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. పర్యాటకులు రాకపోతే కశ్మీరీ ప్రజలకు జీవనోపాధి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్లో వేలాది సామాన్య కుటుంబాలు పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు తిండి లేకుండా చేశారని మండిపడ్డారు.
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కశ్మీర్కు వస్తారని, ఇలాంటి దాడుల వల్ల వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు తగ్గిపోతారని, తద్వారా కశ్మీరీ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.