జైల్లో సీదిరి అప్పలరాజుతో ములాఖత్.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన, బూడి ముత్యాలనాయుడు ఫైర్
కూటమి ప్రభుత్వం కుట్రలతో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందన్న కృష్ణదాస్
ఉద్దేశపూర్వకంగా సీదిరి కుటుంబాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారన్న ముత్యాలనాయుడు
శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైసీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు ములాఖాత్లో కలిశారు. అప్పలరాజుకు పార్టీ పూర్తీ స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన నేతలు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ, పోలీసులు రోడ్లపై భారీగా మోహరించి వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సాధారణంగా జరిగే ప్రమాదాలను ఉద్దేశపూర్వక నేరాలుగా చిత్రీకరిస్తూ సీదిరి కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు.
కుంభా రవిబాబు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాద కేసులో బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్యతో సమానమైన తీవ్రమైన నేరం) వర్తింపజేయడం చట్టవిరుద్ధమని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తున్నారని, అయితే ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.