KTR: సివిల్స్ లో సత్తా చాటిన తెలంగాణ తేజాలకు కేటీఆర్ శుభాకాంక్షలు

- సివిల్స్ విజేతలకు కేటీఆర్ అభినందనలు
- యువతకు మీ విజయం స్ఫూర్తి అన్న కేటీఆర్
- వరంగల్ యువతి శివానికి ప్రత్యేక అభినందన
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన తెలంగాణ అభ్యర్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి చెందిన పలువురు యువతీ యువకులు అత్యున్నత ర్యాంకులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, 11వ ర్యాంకు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటిన వరంగల్కు చెందిన ఎట్టబోయిన సాయి శివానికి కేటీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె విజయం నారీశక్తికి నిదర్శనమని, యావత్ తెలంగాణకే గర్వకారణమని ఆయన కొనియాడారు. అలాగే, 46వ ర్యాంకు సాధించిన రావుల జయసింహారెడ్డి, 62వ ర్యాంకు పొందిన శ్రవణ్ కుమార్ రెడ్డి, 68వ ర్యాంకు దక్కించుకున్న సాయి చైతన్య జాదవ్లతో పాటు మెరుగైన ర్యాంకులు సాధించిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
విజేతల అసాధారణ విజయానికి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు, అభ్యర్థుల అలుపెరుగని దీక్ష, పట్టుదలే కారణమని కేటీఆర్ అన్నారు. యువత సాధించిన ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అత్యున్నత సర్వీసుల్లో చేరబోతున్న ఈ యువ అధికారులు దేశ ప్రగతికి, పేద ప్రజల అభ్యున్నతికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.