Revanth Reddy: రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలి: రేవంత్ రెడ్డి

- జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా
- బీసీల గొంతును వినిపించడానికే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడి
- దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలనేది కాంగ్రెస్ నిర్ణయమన్న ముఖ్యమంత్రి
స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలంటే జనాభా లెక్కలు తేలాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీల గొంతు వినిపించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనాభా ఎంత ఉందో తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదని కోర్టులు స్పష్టం చేశాయని ఆయన గుర్తు చేశారు.
జనగణనతో పాటు కులగణనను కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలనేది తమ పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. బీసీలను బలపర్చాలనే ఆలోచన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లేదని ఆయన విమర్శించారు. దేశంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.