కన్నడ ప్రజలను ఆగ్రహానికి గురిచేసిన రష్మిక వ్యాఖ్యలు!

karnataka people troll rashmika for her comments
  • ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకున్న రష్మిక
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన రష్మిక వ్యాఖ్యలు  
  • సొంతూరు పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది ఏమిటంటూ రష్మికను ప్రశ్నిస్తున్న కన్నడ సినీ అభిమానులు
హీరోయిన్ రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటకు చెందిన రష్మిక 'కిరిక్ పార్టీ' సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తెలుగులో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా, హిందీ చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు.

అయితే, ఇటీవల ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాను హైదరాబాద్ నుంచి వచ్చినా, ఇక్కడి ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలను పలువురు కన్నడ వాసులు తప్పుబట్టారు. కర్ణాటకలోని విరాజ్‌పేట హైదరాబాద్‌కు ఎప్పుడు వెళ్లిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు సొంతూరు (విరాజ్‌పేట) గురించి చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

రష్మిక ఇలాంటి ట్రోలింగ్‌లను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ కన్నడ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ, తాను విద్యార్థినిగా ఉన్నప్పుడు ఓ అందాల పోటీలో పాల్గొని విజయం సాధించానని, అప్పట్లో పేపర్లలో వచ్చిన తన ఫోటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిందని చెప్పారు. అయితే, తనకు మొదటి అవకాశం ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడంపై కన్నడ సినీ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సినిమాలను బ్యాన్ చేయాలంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 
Go Back to Shorts
Karnataka
Rashmika Mandanna
Movie News

More Telugu News