జగన్ పై ఉన్న కేసులను జాతీయ మీడియా ఓసారి గుర్తుచేసుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ
- జగన్ ఇవాళ అమాయకుడిలా నటిస్తున్నాడన్న పవన్
- జడ్జిలపైనా, కోర్టులపైనా వ్యాఖ్యలు చేయించిన వ్యక్తి అంటూ ఆరోపణలు
కోర్టులను అవమానించిన వ్యక్తి, జడ్జిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయించిన వ్యక్తి, ఎన్నికల అధికారిని దూషించిన వ్యక్తి జగన్ అని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ కు వ్యవస్థలంటే గౌరవం లేదని, ఎన్నోసార్లు కోర్టులతో చీవాట్లు తిన్నాడని వివరించారు.
మాజీ సీఎం జగన్ పై ఉన్న కేసులు చాలా తీవ్రమైనవని, చాలాకాలంగా పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. జగన్ పై 32 కేసులు ఉన్నాయి... అతడు జైల్లో 16 నెలలు ఉన్న వ్యక్తి... బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి... అలాంటి వ్యక్తిని నమ్ముతామా? అని ప్రశ్నించారు. జగన్ కేసులపై త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గౌరవ న్యాయస్థానాలను కోరుతున్నానని తెలిపారు.