40 ఏళ్ల తర్వాత ఐఎస్ఎస్ కు మళ్లీ మరొక భారతీయుడు!
- అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన ఏకైక ఇండియన్ రాకేశ్ శర్మ
- ఐఏఎఫ్ మాజీ పైలట్ ను ఐఎస్ఎస్ కు తీసుకెళ్లిన సోవియట్ రాకెట్
- భారత మూలాలున్న పలువురు సైంటిస్టుల అంతరిక్ష యానం
- వచ్చే ఏడాది చివరిలోగా మరో ఇండియన్ ను పంపిస్తామన్న నాసా
వచ్చే ఏడాది (2024) చివరిలోగా చేపట్టబోయే ప్రాజెక్టులో ఇండియన్ సైంటిస్టుకు ఈ అవకాశం కల్పించనున్నట్లు నాసా తెలిపింది. అయితే, ఎవరిని పంపించాలనే విషయంలో నాసా జోక్యం చేసుకోదని, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కే ఆ బాధ్యత అప్పగించామని పేర్కొంది. ఇస్రో ఎంపిక చేసిన వ్యోమగామి/ సైంటిస్టుకు అమెరికాలో శిక్షణ ఇస్తామని వివరించింది. ఈమేరకు నాసా చీఫ్ బిల్ నెల్సన్ మీడియాకు వివరించారు. అమెరికా అంతరిక్ష పరిశోధకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నెల్సన్.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇస్రో ఇటీవల నిర్వహించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి అభినందనలు తెలిపారు.