పుంగనూరు ఘటన ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం: విష్ణుకుమార్ రాజు

Vishnu Kumar Raju reacts on Punganuru incident
  • స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ 
  • చంద్రబాబుకు మద్దతుగా శ్రీకాకుళం వాసుల సైకిల్ యాత్ర
  • కుప్పం చేరుకునే క్రమంలో పుంగనూరు మండలంలో ఘటన
  • చంద్రబాబు మద్దతుదారులతో పసుపు చొక్కాలు విప్పించిన వైసీపీ
స్కిల్ కేసులో రిమాండులో వున్న చంద్రబాబుకు మద్దతుగా కొందరు టీడీపీ అభిమానులు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టగా, పుంగనూరు మండలంలో వైసీపీ నేత చెంగలాపురం సూరి వారితో పసుపు చొక్కాలు విప్పించిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

తాజాగా, ఈ అంశంపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా తీవ్రంగా స్పందించారు. పుంగనూరు ఘటన ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రులంటే అంత చిన్న చూపా... ఉత్తరాంధ్రలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. పెద్దిరెడ్డికి పుంగనూరును సీఎం రాసిచ్చేశారా? అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ ఘటనను మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది అత్యంత హేయమైన ఘటన అని, సదరు రౌడీ మూకలు జగన్ కు, పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. 
Advertisement
Vishnu Kumar Raju
Punganuru Incident
TDP Supporters
YCP Leader
Chandrababu
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News