Advertisement

మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్

CM Jagan deposit funds for Jagananna Vidya Deevena
  • విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లను పొందిన 213 మందికి ఆర్థికసాయం
  • పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనన్న జగన్
  • ట్యూషన్ ఫీజు వంద శాతం రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామని వెల్లడి
జగనన్న విదేశీ విద్యా దీవెన కింద విదేశాల్లోని యూనివర్శిటీల్లో అడ్మిషన్లను పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్ల నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆయన బటన్ నొక్కి డబ్బులను జమ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందించింది.  

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో జగనన్న విదేశీ విద్యా దీవెన ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు. మరో మంచి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదని చెప్పారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని అన్నారు. విదేశీ యూనివర్శిటీల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లను పొందారని... వీరికి రూ. 19.95 కోట్ల సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. మన పిల్లలు ప్రపంచ వేదికపై రాణించాలని అన్నారు. 

విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి మానవ వనరుల మీద పెట్టినట్టేనని జగన్ అన్నారు. గాంధీ, నెహ్రూ వంటి వారు పెద్ద యూనివర్శిటీల నుంచి వచ్చినవారేనని... అందుకే పిల్లలు బాగా చదువుకునేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్ఠంగా రూ. 1.25 కోట్లు, మిగిలిన వారికి గరిష్ఠంగా రూ. కోటి వరకు సాయం అందిస్తున్నామని... ట్యూషన్ ఫీజు వందశాతం రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంవోలోని అధికారులను సంప్రదించాలని చెప్పారు.
Advertisement
Jagan
YSRCP
Jagananna videsi Vidya Deevena

More Telugu News