Advertisement

బాధ్యతల నుంచి తొలగించాలన్న తీర్పుపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హైకోర్టులో అప్పీల్‌

HYDRA Commissioner Ranganath appeals in High Court against verdict to remove him from duties
  • కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలన్న సింగిల్‌ జడ్జి
  • హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన హైడ్రా కమిషనర్‌
  • బదిలీ సూచనను సవాల్‌ చేసినట్లు సమాచారం
  • కోర్టు వ్యాఖ్యలపైనా న్యాయపరమైన అంశాలు
  • అప్పీల్‌పై హైకోర్టు స్పందనపై ఉత్కంఠ
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అప్పీల్‌ దాఖలు చేశారు. తనను కమిషనర్‌ బాధ్యతల నుంచి బదిలీ చేయాలన్న సూచనతో పాటు తీర్పులో చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన అప్పీల్‌లో ప్రస్తావించినట్లు సమాచారం.

వివాదాస్పద ఆస్తి విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైడ్రా కమిషనర్‌ ఉల్లంఘించారని సింగిల్‌ జడ్జి ధర్మాసనం అభిప్రాయపడింది. యంత్రాలు, సిబ్బందితో సదరు భూమిలోకి వెళ్లడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. పరిపాలనలో చట్టపరమైన చర్యలకు మాత్రమే ప్రాధాన్యం ఉండాలని స్పష్టం చేసింది.

ఒకే భూవివాదానికి సంబంధించి మూడుసార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. హైడ్రాపై 60కి పైగా పిటిషన్లు పెండింగ్‌లో ఉండటాన్ని కూడా ప్రస్తావించింది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘టాటా మోహన్‌రావు’ కేసు తీర్పును సింగిల్‌ జడ్జి ప్రస్తావించారు. శిక్షించడం కంటే క్షమించడంలోనే ఔన్నత్యం ఉందన్న భావనను గుర్తుచేశారు. ఈ కేసులో రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ విచారణను ముగించారు. అదే సమయంలో ఆయనను కమిషనర్‌ బాధ్యతల నుంచి బదిలీ చేసి మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

ఈ తీర్పు వెలువడి నెల రోజులు గడిచిన తర్వాత రంగనాథ్‌ అప్పీల్‌కు వెళ్లారు. బదిలీ సూచనతో పాటు సింగిల్‌ జడ్జి చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన అంశాలను ఆయన లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ అప్పీల్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Advertisement
AV Ranganath
HYDRA Commissioner
Telangana High Court
Shanta Sriram Constructions
Contempt of Court
HYDRA Hyderabad

More Telugu News