Telugudesam: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు

  • హత్యకు గురైన కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లకుండా బుద్ధాను అడ్డుకున్న పోలీసులు
  • రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బుద్ధా
  • జగన్ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ
budda venkanna fires on pinnelli ramakrishna reddy

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పల్నాడులోని జంగమేశ్వరపాడులో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న వెంకన్న విజయవాడలోని తన నివాసం నుంచి బయలుదేరారు. అయితే, ఆయన పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకన్న రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పల్నాడులో రెచ్చిపోతున్న పిన్నెల్లిని బహిరంగంగా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడులో గతంలో తనపై కూడా హత్యాయత్నం జరిగిందని, పల్నాడులో పిన్నెల్లి అరాచకాలకు అంతేలేకుండా పోతోందని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని జగన్ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్త హత్యకు గురైతే నివాళి అర్పించేందుకు వెళ్లకుండా అడ్డుకోవడమేంటని పోలీసులను ఆయన ప్రశ్నించారు.

More Telugu News