Allu Arjun: అల్లు అర్జున్ అభిమానుల రచ్చ.. హిందూపురంలో థియేటర్ పై రాళ్లు విసిరిన ఫ్యాన్స్!

  • ఈరోజు విడుదలైన అల్లు అర్జున్ 'పుష్ప'
  • టిక్కెట్లు విక్రయించి బెనిఫిట్ షో వేయని బాలాజీ థియేటర్
  • బన్నీ అభిమానుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
Allu Arjun fans attacks theatre in Hindupur for not playing benefit show

అనంతపురం జిల్లా హిందూపురంలో అల్లు అర్జున్ అభిమానులు రచ్చ చేశారు. బన్నీ తాజా చిత్రం 'పుష్ప' ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందూపురంలోని బాలాజీ థియేటర్ లో విడుదలైంది. అయితే బెనిఫిట్ షో వేస్తామంటూ థియేటర్ యాజమాన్యం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసింది. టిక్కెట్ కొనుక్కున్నవాళ్లంతా ఈ ఉదయం ఎంతో ఉత్సాహంగా థియేటర్ వద్దకు వెళ్లారు. అయితే వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. థియేటర్ యాజమాన్యం బెనెఫిట్ షో వేయలేదు. దీంతో బన్నీ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. థియేటర్ పై రాళ్లు రువ్వారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అభిమానులను చెదరగొట్టి, అక్కడి నుంచి పంపించేశారు. థియేటర్ గేట్లను మూసివేశారు. మరోవైపు బెనిఫిట్ షోలను వేయకూడదంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు 'పుష్ప' సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. బన్నీ నటన అదుర్స్ అని అభిమానులు అంటున్నారు.

More Telugu News