ఎన్టీఆర్ యుగ పురుషుడన్న బాలయ్య.. 'మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా' అంటున్న జూనియర్ ఎన్టీఆర్
- ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళి
- మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారు: బాలకృష్ణ
- మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది: జూనియర్ ఎన్టీఆర్
'గల్లీల్లో తిరిగి పాలుపోసినవాడు ఢిల్లీకి దడ పుట్టించటం. రంగులేసుకునేవాడు రాజ్యాలు ఏలటం. గ్రీకు శిల్పంలాంటి రూపంతో పురాణ పాత్రల్లో జీవించటం. అన్నా అన్నా అని ఆర్తిగా కోట్ల మందితో పిలిపించుకోవటం. తరాలు మారుతున్నా తరగని కీర్తి ఆర్జించటం. తోటరాముడుగా మొదలయ్యి కోట రాముడు గా ఎదగటం. కలలోనే సాధ్యమయ్యే పనులని ఇలలో చేసి చూపించటం.. ఒక్క తారకరాముడికే చెల్లింది. ఆ చరిత్రకారుడు, యుగపురుషుడు శ్రీ నందమూరి తారకరాముని 98వ జయంతి రోజున వారి దివ్య స్మృతిలో అనుక్షణం వారిని స్మరిస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ' అని ఆయన పేర్కొన్నారు.
'మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా..' అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..' అంటూ ఎన్టీఆర్ అన్నారు. కాగా, ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటున్నారు.