జగన్ సీఎం అయిన తొలి నెలలోనే పోస్కో ప్రతినిధులు ఆయనను కలిశారు: టీడీపీ నేత పట్టాభి
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తొలి ముద్దాయి జగన్
- ప్రతి విషయం జగన్ కు తెలిసే జరిగింది
- ఈ విషయాన్ని నీతిఆయోగ్ సమావేశంలో ఎందుకు లేవనెత్తలేదు?
జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి నెలలోనే (2019 జూన్) పోస్కో ప్రతినిధులు ఆయనను కలిశారని పట్టాభి చెప్పారు. 2019 జులైలో స్టీల్ అధికారులకు పోస్కో ప్రతినిధులు ప్రపోజల్ అందించారని తెలిపారు. అదే సంవత్సరం అక్టోబరులో ఎంఓయూ చేసుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు జగన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంటులో ఎందుకు లేవనెత్తలేదని నిలదీశారు.
విశాఖ స్టీల్ కు సంబంధించి ప్రతి ఘట్టానికి ముందు, వెనక పోస్కో ప్రతినిధులు జగన్ నో, విజయసాయిరెడ్డినో కలిశారని పట్టాభి చెప్పారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీతిఆయోగ్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని జగన్ ప్రస్తావించలేదని చెప్పారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన పనులను జగన్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఆడుతున్న నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.