Janasena: శిరోముండనం ఘటన నిందితులతో మా పార్టీకి సంబంధం లేదు!: జనసేన ప్రకటన

  • నూతన్ నాయుడు ఇంట్లో యువకుడికి శిరోముండనం
  • నిందితులతో తమకు సంబంధం లేదన్న జనసేన
  • పవన్ కు లక్షల్లో అభిమానులు ఉంటారని వెల్లడి
Janasena responds on Nutan Naidu issue

విశాఖ జిల్లా పెందుర్తిలో బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు నివాసంలో శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడికి శిరోముండనం జరగడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అని, ఆయన జనసేన పార్టీలో ఉన్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనలో పవన్ కల్యాణ్ పేరును తీసుకురావడం సరికాదని స్పష్టం చేసింది.

శిరోముండనం కేసులో నిందితులు జనసేన పార్టీలో కనీసం సభ్యులు కూడా కారని పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అన్యాయానికి కొమ్ముకాసే నేత కాదని, అన్యాయం ఎక్కడ జరిగినా జనసేన వ్యతిరేకిస్తుందని తెలిపారు. పవన్ కు లక్షల మంది అభిమానులు ఉంటారని, నిందితుడు ఆయన అభిమాని అయినంత మాత్రాన ఈ వ్యవహారంలో పవన్ పేరు తీసుకురావడం సబబు కాదని పేర్కొన్నారు. సంబంధం లేని విషయాలను అంటగట్టాలని చూస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని శివశంకర్ హెచ్చరించారు.

More Telugu News