ఆఫ్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. ఇది దురాక్రమణేనన్న భారత్

Pakistan airstrikes on Afghanistan India terms it as aggression
  • పాక్ చర్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
  • దాడుల్లో 36 మంది పౌరుల మృతి.. 163 మందికి గాయాలు
  • పాక్ వైఖరి ప్రాంతీయ శాంతికి ముప్పు అని హెచ్చరిక
  • ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించిన తాలిబన్లు
అఫ్గానిస్థాన్ భూభాగంపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా పలువురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ చర్య అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని, ఇది ప్రాంతీయ శాంతికి పెను ముప్పుగా పరిణమిస్తుందని భారత్ అభివర్ణించింది.

ఈ మేరకు భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ దుందుడుకు వైఖరికి, బాధ్యతారాహిత్యానికి ఈ దాడులు నిదర్శనమని పేర్కొంది. తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సరిహద్దులకు ఆవల హింసకు పాల్పడుతోందని విమర్శించింది. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అఫ్గాన్ కుటుంబాలకు భారత్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.

పాకిస్థాన్ జరిపిన ఈ దాడుల్లో కనీసం 36 మంది పౌరులు మరణించారని, మరో 163 మంది గాయపడ్డారని తాలిబన్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ సోమవారం ధ్రువీకరించారు. అఫ్గానిస్థాన్‌లోని పక్తియా, పక్తికా, కునార్ ప్రావిన్సుల్లో ఆదివారం రాత్రి ఈ దాడులు జరిగాయని ఆయన తెలిపారు. పక్తియాలోని త్సమ్కానీ జిల్లాలో ఒక నివాస గృహంపై పాక్ యుద్ధ విమానాలు బాంబులు కురిపించాయని, అనంతరం సహాయక చర్యల కోసం గ్రామస్థులు గుమిగూడిన సమయంలో రెండోసారి బాంబు దాడి జరిగిందని ఫిత్రత్ ఆరోపించారు. ఈ ఒక్క ఘటనలోనే 28 మంది గ్రామస్థులు మరణించగా, 158 మంది గాయపడ్డారని ఆయన వివరించారు.

ఈ దాడులను పిరికిపంద చర్యగా, దురాక్రమణగా తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఇప్పటికే తీవ్రంగా ఖండించారు.                                
Pakistan
Afghanistan
India Condemns Pakistan
Airstrikes in Afghanistan
Taliban
Regional Peace

More Telugu News