అయోధ్య రామాలయ కానుకల చోరీ: ఎఫ్‌ఐఆర్ కంటే ముందే రూ. 58 లక్షల రికవరీ!

Ayodhya Ram Temple donation theft 58 lakh recovered before FIR
  • మిగిలిన మొత్తం బ్యాంక్ బదిలీల ద్వారా వాపస్
  • ఇంటర్నల్ ఎంక్వైరీతో తేలిన విరాళాల చోరీ
  • దర్యాప్తు సంస్థల నిఘాలో వింత వ్యూహం
అయోధ్యలోని ప్రసిద్ధ శ్రీరామ జన్మభూమి దేవాలయ కానుకల చోరీ కేసులో సరికొత్త సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్) నమోదు కావడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగడానికి ముందే.. ఆలయ ట్రస్ట్ అధికారులు తమ సొంత విచారణ ద్వారా నిందితుడి నుంచి దాదాపు రూ. 58 లక్షల నగదును రికవరీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చట్టపరమైన ప్రక్రియ ప్రారంభం కాకముందే ఇంత పెద్ద మొత్తంలో సొమ్మును ఎలా రికవరీ చేశారనే అంశం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విరాళాల నిధులలో అక్రమాలు జరిగాయనే విషయం జూన్ 4వ తేదీనే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ట్రస్ట్ ప్రతినిధులు, నాటి ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాల మేరకు మరుసటి రోజే (జూన్ 5న) పోలీసు సిబ్బందిని వెంటబెట్టుకుని ఈ కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ శుక్లా నివాసానికి వెళ్లారు. అక్కడ జరిపిన తనిఖీలలో చోరీకి గురైన సొమ్ములో సుమారు రూ. 58 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కేవలం నగదు రికవరీతోనే ఆగకుండా, జూన్ 5 నుంచి జూన్ 8వ తేదీల మధ్య నిందితులు మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని బ్యాంక్ బదిలీల (ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్) ద్వారా ట్రస్ట్ ఖాతాకు తిరిగి పంపించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా సాగడం, ఆ తర్వాతే ఈ కుంభకోణం వార్తలు బహిర్గతం కావడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాలు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నగదు రికవరీకి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి, అందులో నిందితుడు నల్లటి బ్యాగ్‌తో పోలీసుల పర్యవేక్షణలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రభుత్వం అధికారికంగా సిట్ వేయడానికి ముందే ఈ రికవరీ ప్రక్రియలు జరగడంపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. అసలు చట్టపరమైన ఫిర్యాదు నమోదు చేయకుండానే రికవరీ ఎందుకు ప్రారంభించారు? ఇందులో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కింపు విభాగంలోని ఉద్యోగులే పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.  
Ayodhya Ram Mandir
Avinash Shukla
Champat Rai
Ram Temple donation theft
Ram Janmabhoomi Trust
Ayodhya donation scam recovery

More Telugu News