వంటమనిషిపై దాడి.. వివాదంలో పంజాబ్ కింగ్స్ ప్లేయర్.. తండ్రీ కొడుకులపై కేసు నమోదు
- ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్, ఆయన తండ్రిపై భోపాల్లో కేసు నమోదు
- ఇంట్లో వంట చేసే వ్యక్తిపై దాడి చేసి, దుర్భాషలాడారని ఆరోపణ
- ఉద్యోగం మానేస్తానన్నందుకు ఫోన్ లాక్కొని దాడి చేశారని బాధితుడి ఫిర్యాదు
- బాధితుడికి గాయాలైనట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు
ఉద్యోగం పేరుతో నమ్మించి..
బాధితుడు విపేంద్ర సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రేవాకు చెందిన అతడిని ఇటీవల ఓ పరిచయస్తుడి ద్వారా భోపాల్లోని నిల్బాద్ ప్రాంతంలో ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్ బంగ్లాలో పనికి కుదిర్చారు. నెలకు రూ.15,000 జీతంతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలతో నమ్మి అతను పనిలో చేరాడు.
అయితే, ఉద్యోగంలో చేరిన కొన్ని గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. తాను వండిన ఆహారం నాణ్యతగా లేదంటూ యజమానులు తనపై తీవ్ర మానసిక ఒత్తిడి తీసుకువచ్చి, దూషణలకు దిగారని విపేంద్ర సింగ్ ఆరోపించాడు. ఈ వేధింపులు భరించలేక, ఉద్యోగం మానేసి తిరిగి తన స్వగ్రామానికి వెళ్లిపోతానని చెప్పడంతో గొడవ పెద్దదైంది.
ఫోన్ లాక్కొని, గదిలో బంధించి దాడి
తాను వెళ్లిపోతానని చెప్పడంతో శశాంక్ సింగ్, ఆయన తండ్రి శైలేష్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయారని బాధితుడు తెలిపాడు. తాను ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేందుకు తన మొబైల్ ఫోన్ను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించాడు. వారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నానని, అయినప్పటికీ తండ్రీకొడుకులు తమ డ్రైవర్తో కలిసి తలుపులు తెరిచి తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గాయాలున్నట్లు వైద్య నివేదికలో నిర్ధారణ
ఈ ఘటన అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వారు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విపేంద్ర సింగ్ ముఖం, శరీరంపై గాయాలున్నట్లు స్పష్టంగా నిర్ధారణ అయింది. బాధితుడి ఫిర్యాదు, వైద్య నివేదిక ఆధారంగా రాతిబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 296(బీ) (అసభ్యకర చర్యలు, బహిరంగ దూషణ), సెక్షన్ 115(2) (దాడి చేసి గాయపరచడం), సెక్షన్ 3(5) (ఉమ్మడి ఉద్దేశంతో నేరానికి పాల్పడటం) కింద శశాంక్ సింగ్, ఆయన తండ్రి శైలేష్ సింగ్, మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.