తమిళ రాజకీయాల్లో అన్నామలై సంచలనం.. రికార్డుస్థాయిలో సభ్యత్వాలు
- బీజేపీకి అన్నామలై అధికారిక రాజీనామా
- 'వి ద లీడర్స్' ఉద్యమం ప్రారంభం
- 24 గంటల్లోనే 14 లక్షల సభ్యత్వాలు
- వారసత్వ, కల్ట్ రాజకీయాలకు స్వస్తి
- లోక్సభ ఎన్నికల్లో పోటీయే లక్ష్యం
అన్నామలై నిష్క్రమణతో తమకేం నష్టం లేదని బీజేపీ ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అన్నామలై రాజీనామా చేసిన వెంటనే, ఆయనకు మద్దతుగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజన్తో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా తమ పదవులకు రాజీనామా చేసి అన్నామలై కొత్త ఉద్యమ బాట పట్టారు.
లక్ష్యం.. లోక్సభ ఎన్నికలు
ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. "తమిళనాడులో ఇకపై వారసత్వ రాజకీయాలు, ఒకే ఒక్కడి చుట్టూ తిరిగే కల్ట్ రాజకీయాలు సాగవు. సామాన్యుడే పాలకుడు కావాలి, అదే మా 'వి ద లీడర్స్' ముఖ్య ఉద్దేశం" అని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, యువత సముద్ధరణే ధ్యేయంగా ఈ ఉద్యమం సాగుతుందని.. భవిష్యత్తులో దీనిని ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చి రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీకి నిలుపుతామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, కాబోయే రాజకీయ నాయకులకు నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వడం కోసం "ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్" ను స్థాపించబోతున్నట్లు వెల్లడించారు.
అన్నామలై నిర్ణయాలపై ప్రత్యర్థి పార్టీలు కూడా తక్షణమే స్పందించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఈ కొత్త ఉద్యమాన్ని కొట్టిపారేస్తూ.. "ఇది కేవలం పాత సినిమాను కొత్త పేరుతో రీ-రిలీజ్ చేయడమే" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఏదేమైనా, అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చి 24 గంటలు కూడా గడవకముందే 14 లక్షల సభ్యత్వాలను సాధించడం.. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే, విజయ్ టీవీకే పార్టీల మధ్య సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది.