ఏపీ-సింగపూర్ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్.. గుంటూరు మిర్చికి గ్లోబల్ మార్కెట్: మంత్రి లోకేశ్‌

Nara Lokesh advocates AP Singapore digital trade corridor
  • సింగపూర్‌తో ఏపీ వాణిజ్య బంధంపై మంత్రి లోకేశ్‌ చర్చలు
  • విశాఖ లేదా కృష్ణపట్నం పోర్టులతో డిజిటల్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదన
  • గుంటూరు మిర్చి ఎగుమతులకు సీఐసీ ప్లాట్‌ఫాం ద్వారా సహకారం
  • ఏపీ-సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్‌టేబుల్ ఏర్పాటుకు సూచన
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన సీఐసీ
ఏపీ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు చేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన సింగపూర్ కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (సీఐసీ) సీఈవో గ్లోరియా వూతో సమావేశమై రాష్ట్ర ఎగుమతులను ప్రోత్సహించేందుకు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా సింగపూర్, ఏపీలోని విశాఖపట్నం లేదా కృష్ణపట్నం పోర్టు మధ్య ఒక డిజిటల్ వాణిజ్య కారిడార్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. "సీఫుడ్, వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో వాణిజ్య అనుసంధానం కోసం సీఐసీ సహకారం ఆశిస్తున్నాం. సీఐసీకి చెందిన బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కాగిత రహిత వాణిజ్యం, సరుకు రవాణాలో పారదర్శకత తీసుకురావచ్చు. దీని కోసం ఏపీలోని ఓడరేవుకు, సింగపూర్‌కు మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలి" అని కోరారు.

గుంటూరు మిర్చికి కొత్త మార్కెట్
కోవిడ్ మహమ్మారికి ముందు సీఐసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి చైనాకు మిర్చి ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే సంస్థాగత మద్దతు కొరవడటంతో ఆగిపోయిందని లోకేష్ గుర్తుచేశారు. "ఆ వాణిజ్య కారిడార్‌ను పునరుద్ధరించడం ద్వారా గుంటూరు మిర్చికి కొత్త మార్కెట్‌ను అందించవచ్చు. ఇందుకు సీఐసీ తమ ప్లాట్‌ఫాం ద్వారా సహకరించాలి. రాష్ట్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ) నాణ్యమైన సరుకును గ్రేడింగ్ చేసి సరఫరా చేస్తాయి. కొనుగోలుదారులతో అనుసంధానం, వాణిజ్య ఫైనాన్సింగ్ వంటి విషయాల్లో సీఐసీ తోడ్పాటు అందించాలి. ముందుగా మిర్చి ఎగుమతులపై పైలట్ ప్రాజెక్టు ప్రారంభిద్దాం" అని లోకేశ్‌ సూచించారు. ఇందుకోసం సీఐసీ తన చైనా కొనుగోలుదారుల నెట్‌వర్క్‌ను, ఫైనాన్స్ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయాలని కోరారు.

రౌండ్‌టేబుల్ సమావేశానికి సూచన
మిర్చితో పాటు ఏపీ నుంచి ఎగుమతికి అనువైన ఇతర సరుకులను గుర్తించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని లోకేశ్‌ ప్రతిపాదించారు. "ఏపీలోని ఎగుమతిదారులు, సీఐసీ, ఎంటర్‌ప్రైజ్ సింగపూర్, ఎస్‌జీఎక్స్‌లను ఒకచోట చేర్చి 'ఏపీ–సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్‌టేబుల్' సమావేశాన్ని నిర్వహించాలి" అని ఆయన సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఓడరేవుల ఆధారిత పారిశ్రామికీకరణపై దృష్టి సారించిందని, తద్వారా రాష్ట్ర ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, మిర్చి ఎగుమతుల్లో 40-45 శాతం వాటా కలిగి ఉందని వివరించారు.

ప్రతిపాదనలు పరిశీలిస్తామన్న సీఐసీ సీఈవో
మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై సీఐసీ సీఈవో గ్లోరియా ఊ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులు, అమ్మకందారులు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లను అనుసంధానించే ఒక డిజిటల్ బీ2బీ మార్కెట్‌ప్లేస్ అని ఆమె వివరించారు. బ్లాక్‌చెయిన్ ఆధారిత భద్రత, ఒకే క్లిక్‌తో కస్టమ్స్ క్లియరెన్స్, సప్లై చైన్ ఫైనాన్స్ వంటి సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని గ్లోరియా వూ హామీ ఇచ్చారు.

Go Back to Shorts
Nara Lokesh
AP Singapore digital trade corridor
Guntur chilli
Commodities Intelligence Centre
Visakhapatnam port
Krishnapatnam port
AP exports
agricultural products
sea food exports
digital B2B marketplace

More Telugu News