Advertisement

2024-25లో జాతీయ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్

BJP Tops National Parties Income
  • అన్ని పార్టీలకు రూ.7,960.09 కోట్ల ఆదాయం సమకూరగా, 85 శాతం బీజేపీ ఖాతాలోకి!
  • రూ.918 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో కాంగ్రెస్
  • ఆదాయం కంటే అధికంగా ఖర్చు చేసిన కాంగ్రెస్, బీఎస్పీ
2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలలో బీజేపీ అత్యధిక ఆదాయాన్ని నివేదించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.7,960.09 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపింది. ఇందులో 85.03 శాతం వాటా బీజేపీ ఖాతాలోకి వెళ్లినట్లు పేర్కొంది. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు సమర్పించిన ఆడిట్ నివేదికల ఆధారంగా ఏడీఆర్ ఈ లెక్కలను వెల్లడించింది

ఈ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.6769.14 కోట్ల ఆదాయం సమకూరింది. 918.28 కోట్ల ఆదాయంతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాత 172.60 కోట్లు సీపీఎంకు, రూ.58.58 కోట్లు బీఎస్పీకి, రూ.39.28 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి, రూ.2.18 కోట్లు నేషనల్ పీపుల్స్ పార్టీకి సమకూరాయి.

బీజేపీ తన ఆదాయంలో 55.76 శాతం అంటే రూ.3,774.58 కోట్లు, కాంగ్రెస్ రూ.1111.94 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఖర్చు మొత్తం ఆదాయం కంటే 21.09 శాతం ఎక్కువ. బీఎస్పీ కూడా తనకు సమకూరిన ఆదాయం కంటే 81 శాతం అదనంగా ఖర్చు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఆదాయంలో 92.83 శాతం ఖర్చు చేసింది.

2023-24, 2024-25 మధ్య కాలంలో బీజేపీ ఆదాయం 55.95 శాతం పెరగగా, కాంగ్రెస్ ఆదాయం 25.05 శాతం తగ్గింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆదాయం 73.20 శాతం పెరిగింది. ఆరు జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో 85.08 శాతం విరాళాల రూపంలోనే వచ్చింది. బీఎస్పీకి మాత్రం తన ఆదాయంలో 100 శాతం ఇతర మార్గాల్లో వచ్చింది.
Advertisement
BJP
Bharatiya Janata Party
National Parties Income
Congress
Indian National Congress
Election Commission

More Telugu News