Pawan Kalyan: దక్షిణాదిపై జనసేన గురి: 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' లక్ష్యంగా నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సభ్యత్వ సమరభేరి

Janasena Party Launches Membership Drive in Five States
  • మూడో విడత సభ్యత్వ నమోదుకు జనసేన శ్రీకారం
  • ఏపీ, టీజీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్టలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
  • ఉద్యమి, సాధక్, ప్రదాత పేర్లతో మూడు వర్గాలుగా సభ్యత్వాలు

రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయడమే లక్ష్యంగా, 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' అనే శక్తిమంతమైన నినాదంతో మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదుకు నేడు జనసేన శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గానికే పరిమితమైన ఈ కార్యక్రమం, నేటి నుంచి విసృత రూపం దాల్చనుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు మహారాష్ట్రలోనూ తన ఉనికిని చాటుకోవాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి భారీ స్థాయిలో సభ్యులను చేర్చుకోవడం ద్వారా కేడర్ బలాన్ని ప్రదర్శించాలని అధినేత పవన్ కల్యాణ్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.


ఈసారి క్రియాశీలక సభ్యత్వ రుసుమును రూ. 500 నుండి రూ. 400కు తగ్గించి సామాన్యులకు మరింత చేరువయ్యే ప్రయత్నాన్ని జనసేన చేస్తోంది. కేవలం సభ్యత్వాలు తీసుకోవడమే కాకుండా, కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రకటించింది. సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు, ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ. 2 లక్షల రూపాయలు, గాయపడితే రూ. 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. వసూలైన సభ్యత్వ రుసుమును పూర్తిగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసమే వినియోగించడం ద్వారా కేడర్‌లో భరోసా నింపే ప్రయత్నం చేస్తోంది.


పార్టీ నిర్మాణంలో క్రమశిక్షణను పెంచేందుకు సభ్యత్వాన్ని ఈసారి మూడు విభిన్న వర్గాలుగా విభజించారు. ఉద్యమి, సాధక్, ప్రదాత అనే పేర్లతో కార్యకర్తల పనితీరు, నిబద్ధత ఆధారంగా ఈ వర్గీకరణ సాగనుంది. ఇప్పటికే గత రెండు విడతల్లో విజయవంతంగా 13 లక్షల మందికి పైగా సభ్యులను నమోదు చేసుకున్న జనసేన, ఈ మూడో విడత ద్వారా రికార్డు స్థాయి సంఖ్యను చేరుకోవాలని భావిస్తోంది. సిద్ధాంతాల ప్రచారం, గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతమే ధ్యేయంగా సాగుతున్న ఈ సభ్యత్వ డ్రైవ్‌ను పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Pawan Kalyan
Janasena Party
Membership Drive
South India Politics
Andhra Pradesh Politics
Telangana Politics
Karnataka Politics
Tamil Nadu Politics
Maharashtra Politics
Political Strategy

More Telugu News