అక్రమ సంబంధం ఎఫెక్ట్... ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

Krishna Murder Wife and Lover Kill Husband in Chevela
షార్ట్స్‌లో చూడండి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సంచలనం సృష్టించిన కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. నిద్రిస్తున్న కృష్ణ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడం కృష్ణ (35), జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్‌లో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం రాజేశ్వరికి శరత్‌ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 

ఈ క్రమంలో కృష్ణను అడ్డు తొలగించుకోవాలని రాజేశ్వరి, శరత్ నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కృష్ణతో రాజేశ్వరి గొడవపడింది. అతను నిద్రలోకి జారుకున్నాక, ప్రియుడు శరత్‌కు ఫోన్ చేసి పిలిపించింది. ఇద్దరూ కలిసి కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశారు. అనంతరం శరత్ అతని ఛాతీపై బలంగా కొట్టడంతో కృష్ణ మృతి చెందాడు. 

హత్య తర్వాత ఏమీ తెలియనట్లు నటించిన రాజేశ్వరి, శుక్రవారం ఉదయం తన భర్త పలకడం లేదంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతని తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరిని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు శరత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Go Back to Shorts
Krishna Murder
Rajeshwari
Sharath
Extra Marital Affair
Rangareddy District
Chevela
Crime News
Telangana Crime
Instagram Affair

More Telugu News