PCB-BCB: ఐసీసీకి పాక్, బంగ్లా కొత్త తలనొప్పి... 2031 వరల్డ్ కప్‌ వరకు హైబ్రిడ్ మోడల్ డిమాండ్!

Pakistan Bangladesh Demand Hybrid Model Extension Till 2031 World Cup
  • ఐసీసీపై పాకిస్థాన్, బంగ్లాదేశ్ కొత్త ఒత్తిడి
  • 2031 వన్డే ప్రపంచకప్ వరకు హైబ్రిడ్ మోడల్ పొడిగింపున‌కు డిమాండ్
  • భారత్‌లో జరిగే మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో ఆడేందుకు ప్లాన్
  • టీ20 ప్రపంచకప్ మ్యాచ్ బహిష్కరణ నేపథ్యంలో లాహోర్‌లో చర్చలు
  • పరిహారంతో పాటు పలు డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచిన పీసీబీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ఒత్తిడి పెంచుతున్నాయి. భారత్‌తో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న నిర్ణయంపై జరుగుతున్న చర్చల మధ్య, ఈ రెండు దేశాలు మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి. 2031 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఆతిథ్య అవకాశాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది.

ఎన్డీటీవీ సమాచారం ప్రకారం ప్రస్తుతం 2027 వరకు అమల్లో ఉన్న 'హైబ్రిడ్ మోడల్'ను 2031 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని పాకిస్థాన్, బంగ్లాదేశ్ పట్టుబడుతున్నాయి. 2031 ప్రపంచకప్‌కు భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ డిమాండ్‌కు ఐసీసీ అంగీకరిస్తే, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లన్నీ భారత్‌లో కాకుండా బంగ్లాదేశ్‌లోనే ఆడే అవకాశం లభిస్తుంది.

భారత్‌తో ఈ నెల‌ 15న కొలంబోలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై చర్చించేందుకు ఆదివారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఐసీసీ, పీసీబీ, బీసీబీ ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తరఫున అమీనుల్ ఇస్లాం బుల్బుల్ పాల్గొన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ ఆమోదం తర్వాతే తుది ప్రకటన వెలువడే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి.

ఏమిటీ హైబ్రిడ్ మోడల్?
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో 'హైబ్రిడ్ మోడల్'ను ప్రవేశపెట్టారు. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, భారత్ తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడింది. ఇక, 2026 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తమ మ్యాచ్‌లన్నింటినీ (ఫైనల్‌కు చేరినా కూడా) శ్రీలంకలో ఆడుతుంది. భారత్-పాక్ కీలక మ్యాచ్ కొలంబోలో జరగనుంది. ప్రస్తుతం ఈ ఏర్పాటు 2027 వరకు మాత్రమే ఉంది.

ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పీసీబీ మరో మూడు డిమాండ్లను కూడా ఐసీసీ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కు పెరిగిన పరిహారం అందించడం, టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగినప్పటికీ బంగ్లాదేశ్‌కు పార్టిసిపేషన్ ఫీజు చెల్లించడం, భవిష్యత్తులో తమకు మరో ఐసీసీ ఈవెంట్ నిర్వహణ హక్కులు ఇవ్వడం వంటివి ఈ డిమాండ్లలో ఉన్నాయి. ఈ పరిణామాలతో టీ20 మ్యాచ్ వివాదం మరింత సంక్లిష్టంగా మారింది.
PCB-BCB
ICC
Pakistan Cricket Board
Bangladesh Cricket Board
Hybrid Model
Cricket World Cup 2031
T20 World Cup
India
Mohsin Naqvi
Aminul Islam Bulbul

More Telugu News