Chandrababu: సూపర్ సిక్స్ సూపర్ హిట్.. అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focus on Welfare Development Good Governance
  • గత 19 నెలల పాలనపై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష
  • సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని వ్యాఖ్య
  • తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ పథకాల ప్రగతిపై వివరణ
  • పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు కచ్చితంగా అవసరమని స్పష్టీకరణ
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలన, పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం, అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. 'తల్లికి వందనం' ద్వారా తల్లుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు జమ చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న 'స్త్రీశక్తి' పథకం ద్వారా రాష్ట్రంలో మహిళల మొబిలిటీ పెరిగిందని, ఇప్పటివరకు 4.29 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని వివరించారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న బస్సుల ఆక్యుపెన్సీ కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద రైతులకు రూ. 6,310 కోట్ల ఆర్థిక సహకారం అందించామని తెలిపారు. వీటితో పాటు 'దీపం 2.0' ద్వారా 2 కోట్ల గ్యాస్ సిలెండర్లు, 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల ఆర్థిక చేయూత అందించినట్లు వెల్లడించారు.

వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా, కోస్తా తీరాన్ని ఆక్వా కల్చర్‌లో అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే, ఆ కుటుంబాలను ఆదుకుంటున్నామని చెప్పారు.

ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటున్నామని, ప్రతీ మూడు నెలలకోసారి పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్‌చార్జ్ మంత్రులు కూడా ఇదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. "సంక్షేమ పథకాలు అవసరమా అనే చర్చ సరికాదు. పేదలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు కచ్చితంగా అవసరమే" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu
Andhra Pradesh
Super Six Schemes
Talli ki Vandanam
Free Bus Travel for Women
Annadata Sukhibhava
AP Government Schemes
NTR Bharosa Pension
Agriculture AP
Rayalaseema Horticulture Hub

More Telugu News