Rahul Gandhi: చైనా యుద్ధ ట్యాంకులు భారత్ సరిహద్దులను దాటాయి: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై లోక్‌సభలో వాగ్వాదం

Rahul Gandhi China border remarks spark Lok Sabha debate
  • రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యుల నిరసన
  • ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ
  • ప్రచురణ కాని పుస్తకంలోని అంశాల గురించి మాట్లాడవద్దన్న బీజేపీ
ఐదేళ్ల క్రితం నాటి డొక్లామ్ సరిహద్దు ఉద్రిక్తతల అంశాన్ని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించడంతో గందరగోళం ఏర్పడింది. చైనా యుద్ధ ట్యాంకులు భారత్ సరిహద్దులను దాటాయని రాహుల్ గాంధీ లోక్‌సభలో అన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు నిరసన తెలిపారు.

చైనా సైన్యం భారత సరిహద్దులోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఒక మ్యాగజైన్ ప్రచురించింది. ఆ వివరాలను రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు. లఢక్, డొక్లామ్ ప్రతిష్ఠంభనకు సంబంధించి దేశ సైనికులకు వాస్తవాలు తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రజలకు వాస్తవాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు.

సభను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెబుతున్న పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని, ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నిబంధనల ప్రకారం మాట్లాడాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సూచించారు.

వార్తాపత్రికల క్లిప్పింగ్‌లు, ప్రచురణ కాని పుస్తకాలకు సంబంధించిన విషయాలను లోక్‌సభలో ప్రస్తావించకూడదని స్పీకర్ ఓం బిర్లా రూల్ బుక్ నియమాలను చదివి వినిపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడాలని రాహుల్ గాంధీకి సూచించారు.
Rahul Gandhi
China India border
Doklam
India China conflict
Amit Shah
Rajnath Singh
Manoj Mukund Naravane

More Telugu News