జూబ్లీహిల్స్ లో 300 నామినేషన్లు వేస్తాం.. రేవంత్ ప్రభుత్వానికి మాల జేఏసీ హెచ్చరిక
- రేవంత్ సర్కర్ పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న మాలలు
- ఎస్సీ వర్గీకరణతో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
- కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాలలు కృషి చేయాలని జేఏసీ పిలుపు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడారు. గత ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎస్సీ వర్గీకరణ విధానం వల్ల గ్రూప్-3లోని 25 మాల కులాలకు విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల అధ్యక్షులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరూ స్పందించలేదని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలను అన్ని రంగాల్లో నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మందాల భాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ శాతం పెంచడంతో పాటు, మొదటి 20 రోస్టర్ పాయింట్లలో రెండు కేటాయించాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నాంది పలకాలని ఆయన మాల సమాజానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమికి కంకణం కట్టుకుంటామని హెచ్చరించారు. మాలల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించకపోతే, కాంగ్రెస్ పార్టీ అంతమే తమ పంతంగా నిరసన యుద్ధాన్ని కొనసాగిస్తామని మందాల భాస్కర్ స్పష్టం చేశారు.