ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఫోన్ కూడా ట్యాప్ చేశారా?
- సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
- సినీ ఇండస్ట్రీలోనూ కలవరం
- సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్
ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు, దర్శక నిర్మాతల ఫోన్లు ట్యాప్ చేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
గత ప్రభుత్వ హయాంలో భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ కోసం భరత్ భూషణ్ నిన్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ఎన్నికలకు ముందు భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఆయన ఫోన్ సంభాషణలు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.
సిట్ అధికారులు ఈ విషయంపై లోతైన విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భరత్ భూషణ్ నుంచి సిట్ అధికారులు సమాచారం సేకరించారు. ఈ ట్యాపింగ్ వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఎన్నికలకు ముందు భరత్ భూషణ్ ఒక డిస్ట్రిబ్యూటర్గా మాత్రమే ఉన్నారు. 2024 జులై 28న ఆయన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భరత్ భూషణ్ వంటి సినీ పరిశ్రమ ప్రముఖుడి ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు తెలియడంతో సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.