రేవంత్ రెడ్డి అనుమతితో 'పుష్ప-2' డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్... జై తెలంగాణ అంటూ ప్రసంగం ముగింపు
- అవార్డును అభిమానులకు అంకితమిచ్చిన అల్లు అర్జున్
- ఈ వేడుక ప్రతి ఏటా జరగాలని కోరుకుంటున్నానంటూ అల్లు అర్జున్ వ్యాఖ్య
- గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ ఆనందం
అభిమానులకే ఈ అవార్డు అంకితం: అల్లు అర్జున్
అవార్డు స్వీకరించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిల్మ్ అవార్డును అందుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని తన అభిమానులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. "గద్దర్ అవార్డు వేడుకను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, నిర్మాత దిల్ రాజు గారికి ధన్యవాదాలు. ఈ అవార్డు నాకు దక్కడానికి ముఖ్య కారణం దర్శకుడు సుకుమార్. ఆయన వల్లే ఇది సాధ్యమైంది. 'పుష్ప 2' టీమ్ మొత్తానికి థాంక్స్" అని తెలిపారు.
"'పుష్ప 1' చిత్రాన్ని హిందీలో విడుదల చేయమని దర్శకుడు రాజమౌళి చెప్పకపోయి ఉంటే ఇంతటి ఆదరణ దక్కేది కాదు. ఈ సందర్భంగా ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. 'పుష్ప 2' చిత్రానికి నేను అందుకుంటున్న తొలి అవార్డు ఇది, అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ వేడుక ప్రతి ఏటా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ, ఇది సినిమా అవార్డు వేడుక కాబట్టి సినిమాలో నుంచి ఒక డైలాగ్ చెబుతానంటూ, ముఖ్యమంత్రి, ఇతర పెద్దల అనుమతి కోసం వారి వైపు చూశారు. అందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి "గో ఎహెడ్" అంటూ వెంటనే అంగీకరించారు. దీంతో అల్లు అర్జున్ "నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా..." అనే డైలాగ్ చెప్పారు. చివరలో జై తెలంగాణ, జై హింద్ అంటూ ముగించారు.