Mohit Yadav: చనిపోయిన తర్వాత కూడా నాకు న్యాయం జరగకపోతే... నా అస్థికలు డ్రైనేజిలో కలపండి: ఓ టెక్కీ సూసైడ్ నోట్

Techies Suicide Note If I Dont Get Justice Mix My Ashes in Drainage
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న మానసిక వేధింపులు భరించలేకపోతున్నానంటూ 33 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (టెక్కీ) మోహిత్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బలవన్మరణానికి ముందు ఆయన రికార్డ్ చేసిన వీడియో సందేశం తీవ్ర కలకలం రేపుతోంది. పురుషులకు చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్లే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు మోహిత్ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

"ఈ వీడియో మీకు చేరే సమయానికి నేను ఈ లోకంలో ఉండను. బహుశా పురుషుల కోసం కూడా ఓ చట్టం ఉండి ఉంటే నేను ఈ అఘాయిత్యానికి పాల్పడేవాడిని కాదేమో. నా భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న మానసిక క్షోభను నేను భరించలేకపోతున్నాను. అమ్మానాన్న నన్ను క్షమించండి" అని మోహిత్ కన్నీటితో వీడియోలో పేర్కొన్నారు. "నా మరణం తర్వాత కూడా నాకు న్యాయం జరగకపోతే, నా అస్థికలను ఏదైనా మురుగు కాలువలో కలపండి" అని ఆయన ఆవేదనగా చెప్పడం తీవ్రంగా కలిచివేస్తోంది.

తన భార్య ప్రియా యాదవ్ తన పేరిట ఉన్న ఇల్లు, ఆస్తిని ఆమె పేరు మీద రిజిస్టర్ చేయాలని బెదిరిస్తోందని మోహిత్ ఆరోపించారు. అలా చేయకపోతే తన కుటుంబాన్ని వరకట్న వేధింపుల కేసులో ఇరికిస్తానని హెచ్చరించిందని తెలిపారు. తన మామ మనోజ్ యాదవ్ తప్పుడు ఫిర్యాదు చేశారని, బావమరిది చంపేస్తానని బెదిరించాడని వాపోయారు. అంతేకాకుండా, తన భార్య గర్భం దాల్చితే అత్తగారు బలవంతంగా అబార్షన్ చేయించారని మోహిత్ ఆరోపించడం గమనార్హం.

సరిగ్గా రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్‌లోనే ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నిరంతరం వేధింపులు, ఆర్థిక డిమాండ్లతో తన భర్త, 34 ఏళ్ల మీడియా నిపుణుడు మోహిత్ త్యాగి ఆత్మహత్యకు కారణమైందన్న ఆరోపణలపై సంభాల్ ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే 30 ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. డిసెంబర్ 2020లో పెళ్లైన కొన్నాళ్లకే కష్టాలు మొదలయ్యాయని, పెళ్లి కానుకగా వచ్చిన నగలతో ఆమె వెళ్లిపోయిందని, మోహిత్ త్యాగి, అతని కుటుంబంపై తప్పుడు ఫిర్యాదులు చేసిందని మృతుడి సోదరుడు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

గతేడాది డిసెంబర్‌లో బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల టెక్కీ అతుల్ సుభాష్ కూడా తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు ఆయన 24 పేజీల లేఖ, ఒక వీడియో సందేశాన్ని వదిలివెళ్లారు. అందులో తన భార్య, అత్తమామలు తీవ్రంగా వేధిస్తున్నారని, తనపై 8 తప్పుడు పోలీస్ కేసులు పెట్టారని ఆరోపించారు. విడాకులకు రూ.3 కోట్లు, తన కుమారుడిని చూసేందుకు అదనంగా రూ.30 లక్షలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. అతుల్ తమ్ముడు బికాస్ మోదీ ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాజా మోహిత్ యాదవ్ ఘటన ఈ కేసులను గుర్తుకు తెస్తోంది.
Go Back to Shorts
Mohit Yadav
Uttar Pradesh
Software Engineer
Suicide
Domestic Violence
Dowry Harassment
Priya Yadav
Manoj Yadav
Techie Suicide Note
Male Domestic Abuse

More Telugu News