Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ

Uttam Kumar Reddy allegation on Krishna water
  • కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలన్న మంత్రి
  • కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించడానికి టెలిమెట్రీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
  • గంగా, యమునా తరహాలో మూసీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని, దీనిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. జైపూర్ లో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి నిల్వ సదుపాయాలు, నీటి సరఫరా నిర్వహణపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించడానికి టెలిమెట్రీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. 55 కిలోమీటర్ల పొడువునా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలని కోరారు. గంగా, యమునా పునరుద్ధరణ తరహాలో మూసీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు గోదావరి జలాలను తరలించే పనులకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎన్డీఎస్ఏ విచారణ నివేదిక త్వరగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన కార్యాచరణ సూచించాలని కోరారు.
Advertisement
Uttam Kumar Reddy
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News