తొక్కిసలాట ఘటన... చంద్రబాబు సీరియస్.. కీలక ఆదేశాలు

Chandrababu serious on Tirupati stampade
  • తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఫిక్స్ చేయాలని ఆదేశం
  • అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు గంటన్నర పాటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారుల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద పార్క్ లో వేచి ఉన్న భక్తుల్లో ఒక మహిళ స్పృహతప్పి పడిపోయిందని... దీంతో, ఆమెను కాపాడేందుకు అక్కడ ఉన్న డీఎస్పీ గేటు తీశారని నివేదికలో పోలీసులు తెలిపారు. గేటు తీయడంతోనే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఫిక్స్ చేయాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని సీఎంకు అధికారులు తెలిపారు. 

వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో... భక్తులు ఎక్కువగా వస్తున్నారని స్థానిక జర్నలిస్టులు చెప్పినప్పటికీ... అధికారుల నుంచి పూర్ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందని నిలదీశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా... సరైన ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ సాయంత్రంలోగా కొందరు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు అమరావతి నుంచి తిరుపతికి చంద్రబాబు బయలుదేరారు. కాసేపట్లో ఆయన తిరుపతికి చేరుకోనున్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Tirupati
Stampade

More Telugu News