పొరపాటున రూ. 5900 కోట్లు చెత్త సంచిలో పడేసిన యూకే మహిళ.. లక్ష టన్నుల చెత్త కిందకు చేరిన బ్యాగ్!
- చెత్త సంచిలోకి పొరపాటున హార్డ్డ్రైవ్
- అందులో ప్రస్తుత ధర ప్రకారం రూ. 5900 కోట్ల విలువైన బిట్కాయిన్లు
- న్యూపోర్ట్ సిటీలో లక్ష టన్నుల చెత్త కిందకు చేరిన హార్డ్డ్రైవ్
- అంత చెత్త తొలగించడం పర్యావరణానికి మంచిది కాదన్న సిటీ కౌన్సిల్
- న్యాయపోరాటం ప్రారంభించిన హోవెల్స్
- అది దొరికితే న్యూపోర్ట్ సిటీ అభివృద్ధికి పదిశాతం డబ్బు ఇస్తానని హామీ
ఆమె పేరు హాల్ఫినా ఎడ్డీ ఇవాన్స్. ఒకప్పుడు జేమ్స్ హోవెల్స్తో కలిసి జీవించేది. ఈ క్రమంలో ఒకరోజు ఇంటిని శుభ్రం చేస్తూ చెత్తనంతా ఓ సంచిలో వేసి జేమ్స్ చేతికి ఇచ్చి పడేయమన్నాడు. అతడు చెప్పాడు కదా అని దానిని తీసుకెళ్లి బయటపడేసింది. అయితే, ఆ చెత్త సంచిలోకి పొరపాటున హార్డ్డ్రైవ్ కూడా వెళ్లిపోయింది. ఆ విషయాన్ని ఇద్దరూ గుర్తించలేకపోయారు.
అసలు విషయం తెలిశాక ఇప్పుడు ఇద్దరూ గుండెలు బాదుకుంటున్నారు. అయితే, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లక్ష టన్నుల చెత్తకిందకు అది చేరుకుంది. అయితే, ఈ విషయంలో తన తప్పేమీ లేదని ఇవాన్స్ చెబుతోంది. అతడు దానిని ఎలాగైనా పట్టుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. హార్డ్డ్రైవ్ దొరికినా అందులోంచి తనకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి అతడు పదేపదే మాట్లాడటం మానేస్తే చాలని, అది అతడి మానసిక ఆరోగ్యానికే మంచిదని సలహా ఇచ్చింది.
మరోవైపు, హోవెల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోయిన హార్డ్డ్రైవ్ను తిరిగి సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ చెత్త వద్దకు తనను చేరుకోనివ్వకుండా చేస్తున్నారంటూ న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్పై న్యాయ పోరాటం ప్రారంభించాడు. ఆ బిట్కాయిన్స్ విలువ రోజురోజుకు పెరుగుతోందని చెప్పుకొచ్చాడు.
ఆ డ్రైవ్ తన చేతికి చిక్కి డబ్బుగా మారాక అందులో పదిశాతం న్యూపోర్ట్ను దుబాయ్, లేదంటే లాస్ వేగాస్లా అభివృద్ధి చేసేందుకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని టన్నుల కొద్దీ చెత్తను తవ్వి తీయడం సాధ్యం కాదని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ చెబుతోంది.