కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు మరో 23 రోజుల సమయం మాత్రమే ఉంది: బండి సంజయ్

Bandi Sanjay challenges CM KCR
  • దళితుడిని లేదా బీసీని సీఎంగా చేయగలరా? అని సంజయ్ సవాల్
  • కేసీఆర్‌కు తన రాజకీయ వారసుడిని ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్న  
  • తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని పునరుద్ఘాటన
  • తెలంగాణ ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించిన సంజయ్
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని తమ పార్టీ ప్రకటించిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ పునరుద్ఘాటించారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీసీలు మాత్రమే కాదని, ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా పేదల రాజ్యం, బడుగుబలహీనవర్గాల రాజ్యం రావాలని చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే గతంలో హామీ ఇచ్చినట్లుగా దళితుడిని లేదా బీసీని ముఖ్యమంత్రిగా చేస్తారా? అని సవాల్ చేశారు. అలాగే కేసీఆర్‌కు దమ్ముంటే తన రాజకీయ వారసుడిని ప్రకటించాలని సవాల్ చేశారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. పోలీస్ స్టేషన్‌లో నోటీస్ బోర్డుపై ఉండాల్సిన దొంగలంతా బీఆర్ఎస్‌లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు దండుపాళ్యం ముఠాలు అన్నారు.

కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు మరో 23 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. ఈ దండుపాళ్యం ముఠా తొమ్మిదేళ్లుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతోందన్నారు. ఇచ్చిన మాట మేరకు తాము అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు. వయోపరిమితిని సడలించి నిరుద్యోగులకు జరిగిన నష్టాన్ని పూడుస్తామన్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా అధికారం మాత్రం బీజేపీదే అన్నారు. ఈ విషయం కేసీఆర్‌కు కూడా అర్థమైందన్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
KCR
BRS
BJP
Telangana Assembly Election

More Telugu News