Pakistan: అసలే ఓటమి బాధలో పాకిస్థాన్... తాజాగా ఐసీసీ జరిమానా

ICC imposes fine to Pakistan for slow over rate against South Africa
  • నిన్న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఓటమిపాలైన పాక్
  • చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
  • స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన పాక్
  • ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించిన ఐసీసీ
మూలిగే నక్కపై తాటిపండు పడడం అంటే ఇదేనేమో! దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్ లో కొద్దిలో గెలుపు చేజార్చుకుని తీవ్ర వేదనలో ఉన్న పాకిస్థాన్ కు ఐసీసీ స్లో ఓవర్ రేట్ జరిమానా విధించింది. 

చెన్నైలో గత రాత్రి సఫారీలతో జరిగిన పోరులో పాకిస్థాన్ నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయిందని ఐసీసీ తెలిపింది. నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసిందని వివరించింది. అందుకే ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆరోపణలను పాకిస్థాన్ జట్టు అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా జరిమానాతో సరిపెట్టింది. 

దక్షిణాఫ్రికాతో ఓటమి నేపథ్యంలో, సెమీస్ అవకాశాలను అత్యంత సంక్లిష్టం చేసుకున్న పాక్ జట్టు... టోర్నీలో ఇక తాను ఆడబోయే మూడు మ్యాచ్ ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు కొన్ని మ్యాచ్ లను ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే పాక్ కు సెమీస్ అవకాశాలు ఉంటాయి.
Pakistan
Fine
Slow Over Rate
South Africa
ICC
Chennai

More Telugu News