Sunitha Laxma Reddy: నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ప్రకటించిన కేసీఆర్

Sunitha LaxmaReddy gets b form for Narsapud
  • ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామన్న కేసీఆర్
  • మదన్ రెడ్డితో కలిసి సునీతా లక్ష్మారెడ్డికి బీ ఫామ్ అందించిన ముఖ్యమంత్రి
  • మదన్ రెడ్డితో తనకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉందన్న కేసీఆర్
నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆమెకు బుధవారం బీఫామ్ అందించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి బీఫామ్‌ను అందించారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ టిక్కెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో మదన్ రెడ్డి నర్సాపూర్ సీటుపై వెనక్కి తగ్గారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...  మదన్ రెడ్డి తనతో పాటు మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారని, ఆయనతో తనకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. తనకు ఆప్తుడు, కుడిభుజం లాంటి వాడన్నారు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజాలపై వేసుకొని సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యతను తీసుకున్నారన్నారు. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న మెదక్ నుంచి మదన్ రెడ్డికి అవకాశమివ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు.

మదన్ రెడ్డి మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అన్నారు. ఆయన సేవలను పార్టీ మరింతగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ బీఫామ్ ఇవ్వడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి తన ప్రతిష్ఠను మరింతగా పెంచుకున్నారన్నారు. అందుకు ఆయనకు అభినందనలు, ధన్యవాదాలు అన్నారు.
Sunitha Laxma Reddy
KCR
BRS
Telangana Assembly Election
narsapur

More Telugu News