Chandrababu: చంద్రబాబు అరెస్ట్ పై 35వ రోజూ కొనసాగిన నిరసనలు... ఫొటోలు ఇవిగో!

TDP protests continues for 35th day
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు 35వ రోజూ కొనసాగాయి. మేము సైతం అంటూ కర్నూలులో సంఘీభావ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కర్నూలు ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు, జనసేన, సీపీఐ పార్టీల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర జమ్మలమడుగు నియోజకవర్గం మల్లపాడు గ్రామానికి చేరుకోగా... నియోజకవర్గ నాయకులు ఘనస్వాగతం పలికారు. 

జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని గూడు మస్తాన్ వలి దర్గాలో ముస్లీం మైనార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలంలో 10వ రోజు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సైకిల్ యాత్ర చేపట్టారు. గురిజేపల్లి, చవిటిపాలెం, తంగేడుమల్లి మీదుగా మిన్నెకల్లు వరకు 8 కి.మీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర జరిగింది. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరికాదంటూ ప్రజలకు వివరిస్తూ సైకిల్ యాత్ర కొనసాగించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. 

కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తలపెట్టిన తొమ్మిది రోజుల నవగ్రహ శాంతి హోమంలో భాగంగా ఆరవ రోజు తెలుగుదేశం పార్టీ టీఎన్‌టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి దాపర్తి సీతారామయ్య, భూలక్ష్మి దంపతులు, పాకలపాటి రవి వర్మ, కృష్ణకుమారి దంపతులు పీటలపై కూర్చుని హోమం నిర్వహించారు. తిరువూరు నియోజకవర్గం మేడూరు గ్రామంలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నియోజకవర్గ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

తాడేపల్లి మండలం ప్రాతూరులో గ్రామ పార్టీ అధ్యక్షుడు అరవపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్మ పోరాట నిరహారదీక్ష చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని, ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ మంగళవారం దుగ్గిరాల మండలం, కంఠంరాజు కొండూరు గ్రామంలో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో తెలుగు మహిళలు, నాయకులు పూజలు నిర్వహించారు. 

మంగళగిరి మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ ఆధ్వర్యంలో 50 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ కలమట వెంకటరమణ మూర్తి ఆధ్వర్యంలో వంశధార నదిలో జలదీక్ష చేపట్టారు. జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో పార్టీ నాయకులతో కలిసి ఇంఛార్జ్ శ్రీరాం తాతయ్య సోమవారం రాత్రి నిద్ర చేశారు. ఉదయం పవిత్ర స్థానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

గుంటూరు నార్త్ ప్యారిస్ చర్చిలో క్రైస్తవ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మద్దిరాల మ్యానీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనలలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీ చేపట్టి బాబుతో మేం ఉన్నామంటూ నినాదాలతో హోరెత్తించారు. తదుపరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఒంగోలులో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు మినీ స్టేడియం నుంచి చేపట్టిన ర్యాలీలో నల్ల దుస్తులు, నల్ల బెలూన్లతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. 

నరసరావుపేట నియోజకవర్గంలోని స్థానిక వినుకొండ రోడ్ లో ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మాజీ అధ్యక్షుడు, టీడీపి రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Go Back to Shorts
Chandrababu
Arrest
TDP
Protests
Andhra Pradesh

More Telugu News