హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర సులభతరం.. 9 గంటల ప్రయాణం ఇక 45 నిమిషాల్లోనే... 'విశ్వసముద్ర' కీలకపాత్ర!

Hemkund Sahib Ropeway project to reduce 9 hour journey to 45 minutes
  • హేమ్‌కుండ్ సాహిబ్ యాత్రకు 12.4 కిలోమీటర్ల రోప్‌వే నిర్మాణం
  • 9 గంటల కఠిన ప్రయాణ సమయం 45 నిమిషాలకు తగ్గింపు
  • న్యూజిలాండ్‌ పర్యటనలో ప్రాజెక్టును ప్రస్తావించిన ప్రధాని మోదీ
  • రూ. 2,730 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం
  • వృద్ధులతో పాటు 'వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్' పర్యాటకులకూ ప్రయోజనం
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర భవిష్యత్తులో మరింత సులభతరం, వేగవంతం కానుంది. ప్రస్తుతం 9 గంటలకు పైగా పట్టే కఠినమైన ప్రయాణాన్ని కేవలం 45 నిమిషాలకు తగ్గించే భారీ రోప్‌వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆక్లాండ్‌లో జరిగిన 'కియా ఓరా మోదీ' కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. సిక్కుల వారసత్వాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని ఆయన తెలిపారు.

హిమాలయాల్లో సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవడం అత్యంత కష్టతరమైన పని. ఏడాదిలో ఎక్కువ కాలం మంచుతో కప్పుకొని ఉండే ఈ ప్రాంతానికి వెళ్లేందుకు గోవింద్‌ఘాట్ నుంచి 21 కిలోమీటర్లు కొండల నడుమ కాలినడకన లేదా గుర్రాలు, డోలీల సహాయంతో ప్రయాణించాలి. ఈ ప్రయాణం వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పెను సవాలుగా ఉండేది. ఈ ఇబ్బందులను తొలగించి, భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించే లక్ష్యంతో ఈ రోప్‌వేను నిర్మిస్తున్నారు.

గోవింద్‌ఘాట్ నుంచి ఘంగరియా మీదుగా హేమ్‌కుండ్ సాహిబ్ వరకు మొత్తం 12.4 కిలోమీటర్ల పొడవున ఈ రోప్‌వే నిర్మాణం జరగనుంది. దీని కోసం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఇప్పటికే ఆమోదం తెలిపింది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DBFOT) పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 2,730.13 కోట్లు. హైదరాబాద్ కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ (VSE), నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLML) సంయుక్తంగా ఈ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ రంగంలో విశ్వసముద్ర సంస్థకు గణనీయమైన అనుభవం ఉంది. భారత ఆధ్యాత్మిక నగరం వారణాసిలోనూ రోప్ వే ప్రజా రవాణా వ్యవస్థ నిర్మాణంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది.

కాగా, హేమ్‌కుండ్ రోప్‌వేను రెండు దశల్లో, విభిన్న సాంకేతికతలతో నిర్మిస్తారు. గోవింద్‌ఘాట్ నుంచి ఘంగరియా వరకు మోనోకేబుల్ డిటాచబుల్ గోండోలా (MDG) టెక్నాలజీని, అక్కడి నుంచి హేమ్‌కుండ్ సాహిబ్ వరకు మరింత ఆధునాతనమైన ట్రైకేబుల్ డిటాచబుల్ గోండోలా (3S) టెక్నాలజీని వినియోగిస్తారు. ఇది గంటకు ఒకవైపు 1,100 మందిని, రోజుకు సుమారు 11,000 మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చగలదు. ఈ ప్రాజెక్టు వల్ల హేమ్‌కుండ్ సాహిబ్ యాత్రికులకే కాకుండా, యునెస్కో గుర్తింపు పొందిన 'వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్'ను సందర్శించే పర్యాటకులకు కూడా ప్రయాణం సులభతరం కానుంది.
Advertisement
Hemkund Sahib Ropeway
Vishwa Samudra Engineering
Narendra Modi
Uttarakhand Pilgrimage
Govindghat
Valley of Flowers

More Telugu News