కేటీఆర్ వచ్చాక సిరిసిల్ల మారిపోయింది... షోలాపూర్‌లా చేయాలనేది ప్రయత్నం: కేసీఆర్

KCR Praja Ashirvada meeting in Sircilla
  • తన డెబ్బై ఏళ్ల జీవితంలో సిరిసిల్లలో 170 సార్లు తిరిగానన్న కేసీఆర్
  • హెలికాప్టర్ ద్వారా చూస్తే అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు సజీవ జలధార కనిపించిందన్న సీఎం
  • తనను ఆదరించి కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిపించారన్న కేసీఆర్
  • బతుకమ్మ చీరలను రాజకీయం చేయవద్దని కోరిన కేసీఆర్
కేటీఆర్ చేనేత శాఖ మంత్రి అయ్యాక సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయని, షోలాపూర్ ఎలా ఉంటుందో... సిరిసిల్లను కూడా అలా చేయాలనేదే తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... సిరిసిల్లలో నేత‌న్నలు ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవ‌ద్ద‌ని రాసిన రాత‌ల‌ను చూసి చలించిపోయాన‌న్నారు. 

తన డెబ్బై ఏళ్ల జీవితంలో సిరిసిల్ల‌లో క‌నీసం 170 సార్లు తిరిగానని, ఇక్క‌డ బంధుత్వాలు, ఆత్మీయ‌త‌లు తెలుసునన్నారు. ఎంతోమంది తన క్లాస్‌మేట్స్ ఉన్నారన్నారు. హెలికాప్ట‌ర్‌లో వ‌స్తుంటే అప్ప‌ర్ మానేరు నుంచి సిరిసిల్ల వ‌ర‌కు ఒక స‌జీవ జ‌ల‌ధార‌గా మారిందన్నారు. తాను చిన్న‌ప్పుడు మోటార్ బైక్ మీద‌, సైకిల్ మీద ముస్తాబాద్ నుంచి వస్తుంటే మానేరులో నీళ్లు బాగా కనిపించేవని, కానీ స‌మైక్య పాల‌న‌లో అడుగంటిపోయాయన్నారు. అప్ప‌ర్ మానేరు అడుగంటడంతో ఆ ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్య‌మ స‌భ జ‌రిపిన ప‌రిస్థితిని చూశామన్నారు.

ప్రాణం పోయినా స‌రే రాష్ట్రం రావాలని, వ‌చ్చిన రాష్ట్రం స‌జీవ జ‌ల‌ధారల‌తో క‌ళ‌క‌ళ‌లాడాల‌ని క‌ల‌లు కన్నామని, ఇప్పుడు అప్ప‌ర్ మానేరు ఎండాకాలంలోనూ మ‌త్త‌డి కనిపిస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఉద్యమం సమయంలో ఓ రోజు రాత్రి జయశంకర్, తాను కలిసి సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్నామని, ఆ సమయంలో అక్కడ 'ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కాదు.. చావ‌కండి' అని రాయించారని, ఆ రాత‌లు చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నామన్నారు. తనను కరీంనగర్ ఎంపీగా ఆదరించి గెలిపించారని గుర్తు చేసుకున్నారు.

బతుకమ్మ చీరల పంపిణీ కేవలం చేనేత కార్మికులను ఆదుకోవడం కోసమే అన్నారు. ఎవరికైనా నచ్చకపోతే వాటిని తీసుకోవద్దని, అంతేకానీ చీరల పంపిణీని రాజకీయం చేయవద్దన్నారు. సిరిసిల్ల మంచి విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విపక్షాలతో చాలా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రైతు బంధు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. ధరణి ఉండాలో... రద్దు చేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
Go Back to Shorts
KCR
BRS
Rajanna Sircilla District
Telangana Assembly Election

More Telugu News