Murali Mohan: శరత్ బాబు భౌతిక కాయాన్ని చెన్నై తరలిస్తున్నారు: మురళీమోహన్

  • సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత
  • భౌతికకాయాన్ని సందర్శించిన మురళీమోహన్
  • ఇంత త్వరగా వెళ్లిపోతాడని ఊహించలేదని వెల్లడి
  • శరత్ బాబు భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్ వద్ద ఉంచుతారని వివరణ
Murali Mohan talks about Sarath Babu

సీనియర్ నటుడు శరత్ బాబు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన మృతిపై సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. 

ఆసుపత్రిలో శరత్ బాబు భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనందరి అభిమాన నటుడు శరత్ బాబు మృతి చెందడం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. శరత్ బాబు బతకడం కష్టమని సందేహిస్తూనే ఉన్నామని, కానీ ఇంత త్వరగా వెళ్లిపోతాడని మాత్రం అనుకోలేదని వ్యాఖ్యానించారు. 

తెలుగులోనే కాకుండా పలు ఇతర భాషల్లో కలిపి 250కి పైగా చిత్రాల్లో నటించారని, అలాంటి నటుడు ఇక లేడన్న నిజం జీర్ణించుకోలేకపోతున్నామని మురళీమోహన్ తెలిపారు. 

శరత్ బాబు భౌతికకాయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి ఫిలిం చాంబర్ వద్ద ఉన్న 'మా' కార్యాలయంలో రెండు గంటల పాటు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారని, అనంతరం చెన్నై తరలిస్తారని వెల్లడించారు. శరత్ బాబు అంత్యక్రియలు చెన్నైలో నిర్వహిస్తారని పేర్కొన్నారు.

More Telugu News