yuvagalam: యువగళం యాత్రలో మనసులో మాట.. లోకేశ్ ఇంటర్వ్యూ

  • సమర్థవంతంగా పనిచేయడం టీడీపీ బలం..
  • చేసిన పనులను చెప్పుకోలేకపోవడమే బలహీనత
  • మిస్బా ఆత్మహత్య నన్ను కలిచివేసింది
  • 700 కిలోమీటర్లు దాటిన యువగళం పాదయాత్ర
Nara lokesh Interview in yuvagalam Padayatra

రాష్ట్రంలో పాదయాత్ర సందర్బంగా చాలా విషయాలను తెలుసుకుంటున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన మనసులోని మాటను విలేకరులతో పంచుకున్నారు. 55 రోజులుగా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది.

రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని లోకేశ్ ఆరోపించారు. పాదయాత్రలో చాలామంది ప్రజలు చెబుతున్న, ఫిర్యాదు చేస్తున్న విషయం ఇదేనని ఆయన వివరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పనితీరును పరీక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలు తీసుకొచ్చినా సరే పార్టీ ఓటమి పాలవడం బాధగా అనిపించిందని లోకేశ్ వివరించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ పథకాల అమలుతీరును, లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని లోకేశ్ చెప్పారు.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబు లోకేశ్ మాటల్లో..

మీడియా: పాదయాత్రకు ముందు, తర్వాత మీలో వచ్చిన మార్పులేంటి?
లోకేశ్: టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలయ్యాయి, ప్రజలు వాటి పట్ల ఆనందంగా ఉన్నారా, లేరా? అనేది ప్రస్తుతం నేను గమనిస్తున్నారు. రజకులకు వాషింగ్ మెషీన్లు ఇచ్చాం. లబ్దిదారులు కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయం అప్పట్లో మాకు తెలియలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రజకులకు 500  యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులో రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి పథకంలో నెలకొన్న సమస్యలు తెలుసుకుంటూ, వాటికి పరిష్కారాలు వెతుకుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నాను.

మీడియా: యాత్రలో ఇప్పటి వరకు గుర్తించిన ప్రధాన సమస్యలేంటి?
లోకేశ్: రాష్ట్రంలో నిరుద్యోగమే ప్రధాన సమస్య కాగా, రెండోది గంజాయి. నిత్యావసర దరల పెరుగుదల మహిళలను వేధిస్తోంది. వైసీపీ ప్రభుత్వం విధించిన పన్నులు చాలామందికి భారంగా మారాయి. 

మీడియా: పాదయాత్రలో మీ మనసును కలిచివేసిన ఘటన ఏంటి?
లోకేశ్: ప్రధానంగా రెండు ఘటనలు కలిచివేశాయి.. సత్యవేడు నియోజకవర్గం దాటుతూ ఉండగా ఓ మహిళ బోండాలు తయారుచేసి అమ్ముతోంది. ఆమె వద్దకు వెళ్లి మన ప్రభుత్వం వచ్చాక ఏంకావాలని కోరుకుంటుందో అడిగాను. ఆమె మాట్లాడుతూ ‘‘చిన్న హోటల్ నడుపుతూ కొడుకులు ఇద్దర్నీ చదివించాను. వాళ్లకు ఇంకా ఉద్యోగం దొరకలేదు. వాళ్లకు మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఉద్యోగాలిప్పించండి’’ అని కోరింది. పలమనేరులో వైసీపీ నాయకులు అరాచకాలు సాగిస్తున్నారు. తన కూతురు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని వైసీపీ నాయకుడు ఒకరు మిస్బా అనే అమ్మాయిని స్కూల్ నుంచి పంపంచేశారు. దీంతో ఆ చెల్లి ఆత్మహత్యకు పాల్పడింది. బాగా చదువుకోవాలని, డాక్టర్ కావాలనే కలను పుస్తకంలో రాసుకున్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను.

మీడియా: పాదయాత్రలో మీ కాళ్లనొప్పులు మర్చిపోయేంత ఆనందాన్ని కలిగించిన ఘటన?
లోకేశ్: పెనుకొండ నియోజకవర్గంలో ఓ మహిళా ఉద్యోగి వచ్చి పలకరించింది. గతంలో ఇంటిని చూసుకుంటూ ఉండేదానినని, మా ప్రాంతానికి కంపెనీలు రావడంతో ఉద్యోగం కూడా చేస్తున్నానని తెలిపింది. పిల్లలను, ఇంటిని చాలా చక్కగా చూసుకుంటున్నానని చెప్పడంతో నా మనసు ఆనందంతో ఉప్పొంగింది. కాళ్లనొప్పులు మర్చిపోయాను. మరిన్ని కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వాలనే బలమైన కోరిక ఏర్పడింది.

మీడియా: సెల్ఫీ విత్ లోకేశ్, సెల్ఫీ ఛాలెంజ్.. రెండింటిలో బాగా ఇష్టమైన కార్యక్రమం?
లోకేశ్: ఈ రెండు కార్యక్రమాలూ ఇష్టమే. సెల్ఫీ విత్ లోకేశ్ తో సామాన్యుల సమస్యలు తెలుసుకుంటున్నా. సెల్ఫీ ఛాలెంజ్ తో మేం గతంలో చేసిన పనులను, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను అందరికీ తెలియజేయడానికి బాగా ఉపయోగపడుతోంది. నేను ఇప్పటి వరకు అనేక సెల్ఫీ ఛాలెంజ్ లు ప్రభుత్వానికి విసిరాను. దీనిపై ప్రభుత్వం కానీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ స్పందించలేదు.

మీడియా: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మీ ప్రణాళిక ఏంటి?
లోకేశ్: నిరుద్యోగ సమస్యను 3 రకాలుగా పరిష్కరించవచ్చు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలి. గతంలో టీడీపీ పాలనలో 40వేల పరిశ్రమలు తెచ్చి వాటిలో 6లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుంది. భవిష్యత్తులో కూడా పెట్టుబడులు తెచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండవది ప్రభుత్వరంగంలోని ఖాళీల భర్తీ. మేం అధికారంలోకి జాబ్ క్యాలెండర్ ద్వారా వీటిని భర్తీ చేస్తాం. మూడవది.. స్వయం ఉపాధి ద్వారా యువతకు జీవనోపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ఆసక్తి ఉన్న యువతకు అండగా నిలబడి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.

మీడియా: చాలా రాష్ట్రాలు పోటీపడుతున్నా కియా కంపెనీని ఏపీకే ఎలా తీసుకువచ్చారు? అది ఎలా సాధ్యమైంది?
లోకేశ్: చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. విజనరీకి మారుపేరంటే చంద్రబాబు అని గూగుల్ లో వస్తుంది. క్యాబినెట్ కూర్పులో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సమర్థులకే చోటిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ గా తీర్చిదిద్దాలనేది మా ఉద్దేశం. అలాగే కడపకు ఉక్కు ఫ్యాక్టరీ. కర్నూలుకు సిమెంట్ ఫ్యాక్టరీ. చిత్తూరుకు ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ. ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్. గుంటూరు, కృష్ణాకు రాజధాని ఉంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఫిషరీస్, ఫార్మా, డిఫెన్స్ డెవలప్ మెంట్. ఉత్తరాంధ్రకు ఐటీ. ఇలా అన్ని జిల్లాలకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన ఘనత చంద్రబాబుది. రాజధాని ఒక్కటే ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది మా నినాదం. కియా, టీసీఎల్, ఫాక్స్ కాన్, డిక్సన్, సెల్ కాన్, అదానీ డేటా సెంటర్, డిఫెన్స్ అకాడమీ, అదానీ డేటా సెంటర్ ఏదీ రాజధానిలో లేవు. చంద్రబాబు మరోసారి వెంటనే సీఎం అయి ఉంటే మరో 5లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీలు వచ్చేవి. కియా పరిశ్రమ వల్ల ఉమ్మడి అనంతపురంజిల్లా తలసరి ఆదాయం రూ.30వేలు పెరిగింది. ఇంకా ఎన్నాళ్లు ఉపాధి, ఉద్యోగాలు కోసం కర్నాటక, తమిళనాడు, తెలంగాణ వైపు మనం చూడాలి? మనం ఎందుకు నంబర్ వన్ కాకూడదు? ఇది చంద్రబాబు నినాదం. అందుకే కియాను ఏపీకి తెచ్చి చూపించారు.

మీడియా: కియా కంపెనీ లోగో చూస్తుంటే మీ అనుభూతి ఏంటి?
లోకేశ్: కియా కంపెనీ లోగో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. లోగో చాలా చిన్నగా ఉండొచ్చు.. కానీ దాన్ని తీసుకురావడం వెనక వెనుక చాలా కష్టం ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేసినా, కియా పరిశ్రమను జిల్లాకు తీసుకొచ్చినా కూడా ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారని బాధపడ్డాను. అందుకే నేను సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకున్నాను. పెనుగొండకు ఇన్ని కంపెనీలను చూశాక ఇన్ని వందల కంపెనీలు ఇక్కడున్నాయా? అని నేను ఆశ్చర్యపోయాను. టీడీపీ బలం సమర్థవంతంగా పనులు చేయడం. అయితే, చేసిన పనులను చెప్పుకోలేకపోవడం బలహీనతగా గుర్తించాం. అందుకే పాదయాత్ర ద్వారా టీడీపీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం.

మీడియా: మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యమనే వైసీపీ వాదనపై మీ అభిప్రాయం?
లోకేశ్: వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించి ఇప్పటికి మూడేళ్లు అయ్యింది. ఇప్పటికీ ఈ మూడు రాజధానులలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదు. కియా కంపెనీ ఫేక్ అంటూ జగన్ తన పాదయాత్రలో విమర్శించారు.. ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలి. జగన్ చెప్పే విషయాల్లో నిజానిజాలను ప్రజలు తెలుసుకోవాలి. కియా కంపెనీని ఫేక్ అంటున్న వైసీపీ వాళ్లు తిక్కలోళ్లు అని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.

మీడియా: ఏపీ అన్ని రంగాల్లో ముందున్నదని వైసీపీ నాయకులు చెబుతున్నారు.. మీరేమంటారు?
లోకేశ్: వైసీపీ ప్రభుత్వం హత్యలు, గంజాయి సరఫరాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం చివరిస్థానంలో ఉన్నారు.

మీడియా: టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది?
లోకేశ్: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించేందుకు పోరాడుతూ టీడీపీ నిత్యం ప్రజలతోనే ఉంటుంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది ఎన్నికల సమయంలో టీడీపీ అధిష్టానం నిర్ణయిస్తుంది. 

మీడియా: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందా?
లోకేశ్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాకే ఓట్లడగాలని జగన్ కు, హామీల అమలుపై జగన్ ను నిలదీయాలని ప్రజలను కోరుతున్నాం.

మీడియా: టీడీపీ పాలనలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏం చెబుతారు?
లోకేశ్: దోపిడీ సొమ్ము అంతా జగన్ ఇంట్లోనే ఉంటుంది. టీడీపీ పాలనలో అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలనూ వైసీపీ నేతలు చూపించట్లేదు. ఎక్కడా నిరూపించలేదు. అంటే మేం అవినీతికి పాల్పడలేదని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. దోచుకున్న డబ్బుతో బుల్లెట్ ఫ్రూప్ కార్లలో జగన్ తిరుగుతున్నారు.

మీడియా: వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ నేతలు మీపై చేస్తున్న ఆరోపణలపై ఎలా స్పందిస్తారు?
లోకేశ్: ఒక అబద్దాన్ని వెయ్యిసార్లు చెబితే ప్రజలు నిజమని నమ్ముతారనేది వైసీపీ సిద్ధాంతం. సొంత బాబాయ్ ని చంపిన జగన్ మాపై ఆరోపణలు చేస్తున్నాడు. అధికారంలోకి రాకముందు సీబీఐ విచారణకు డిమాండ్ చేసి, అధికారంలోకి వచ్చాక విరమించుకున్న వ్యక్తి జగన్. నేడు సీబీఐ విచారణలో జగన్ రెడ్డి, భారతీరెడ్డిల సహాయకులు, అధికారులు కూడా హాజరయ్యారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన అంశాలన్నీ జగన్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. దీన్నిబట్టి రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే వివేకానందరెడ్డిని ఎవరు చంపారో అర్థమైపోయింది. మనం చెప్పాల్సిన అవసరంలేదు.

మీడియా: ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ.. అమలు సాధ్యమేనా?
లోకేశ్: నూటికి నూరు శాతం అమలుచేయగలిగే హామీలే ఇస్తున్నాను.. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత. ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేదే మా ఆలోచన. ఇచ్చిన ప్రతి హామీని ఎలా నెరవేర్చాలో మాకు స్పష్టత ఉంది.

మీడియా: పార్టీలో మార్పులు చేర్పుల అవసరాన్ని ఈ పాదయాత్రలో గమనించారా?
లోకేశ్: యువగళం పాదయాత్రకు యువత పెద్దఎత్తున వస్తున్నారు. పార్టీలో వాళ్లు అధికంగా భాగస్వామ్యమవుతున్నారు. పార్టీలో యువతను పెద్దఎత్తున ప్రోత్సహించాలనే అంశాన్ని గమనించాం. రాబోయే కాలంలో అమలు చేస్తాం.

మీడియా: వైసీపీ పాలనలో దళితులపై దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి. మీరు అధికారంలోకి వచ్చాక దళితులకు ఏం భరోసా ఇస్తారు?
లోకేశ్: వైసీపీ పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. కఠినతరమైన చట్టాలను సైతం వైసీపీ వాళ్లు తమ చుట్టాలుగా మార్చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళితుడు సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపి డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబు బెయిల్ పై జైలు నుంచి బయటకు వస్తే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ సుధాకర్ తో మొదలుకుని తాజాగా పులివెందులలో వెటర్నరీ డాక్టర్ అచ్చన్న వరకు దళితులపై దమనకాండ కొనసాగిస్తూనే ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై చేయి వేయాలన్నా భయపడేలా కఠినతరంగా చట్టాలను అమలు చేస్తాం. దళితులకు టీడీపీ అండగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాం. 

మీడియా: పాదయాత్ర చేయడానికి లోకేశ్ కు ఉన్న అర్హతేంటనే వైసీపీ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి?
లోకేశ్: గత నాలుగేళ్లుగా వైసీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల కంటే రెండున్నరేళ్లు నేను మంత్రిగా చేసిన పనులే ఎక్కువ. అదే నాకున్న అర్హత. వందల కొద్దీ కార్యక్రమాలు మేం గతంలో చేశాం. రానున్న కాలంలో కూడా చేస్తాం. మేం చేసిన పనుల్లో చంద్రబాబు బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తోంది.

More Telugu News