Nara Lokesh: ఈ మాట నేను అనడంలేదు... వైసీపీ ఎమ్మెల్యేలే అంటున్నారు: లోకేశ్

  • శ్రీ సత్యసాయి జిల్లాలో యువగళం పాదయాత్ర
  • పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ కు అపూర్వ స్వాగతం
  • యాపిల్ పండ్లతో భారీ గజమాల
  • కిలోమీటరు మేర లోకేశ్ కు రెడ్ కార్పెట్
Lokesh criticizes CM Jagan

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జనం పోటెత్తారు. 52వ రోజు యువగళం పాదయాత్ర కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట వద్ద విడిది కేంద్రం నుంచి సోమవారం ప్రారంభమైంది. 

పాదయాత్ర ప్రారంభ సమయానికి వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు క్యాంప్ సైట్ వద్దకు చేరుకొని యువనేతతో సెల్ఫీలు దిగేందుకు బారులు తీరారు. సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం తర్వాత పాదయాత్ర ప్రారంభమయ్యాక జనం అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం పట్టారు. గోరంట్లలో లోకేశ్ కు భారీ స్వాగతం పలికి యాపిల్ తో చేసిన భారీ గజమాలతో సత్కరించారు. హెచ్.పి. పెట్రోల్ బంక్ నుండి బహిరంగ సభ ప్రాంగణం వరకు సుమారు కిలోమీటరు మేర రెడ్ కార్పెట్ పరిచి లోకేశ్ కు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికారు. 

లోకేశ్ కు సంఘీభావం తెలిపిన ప్రముఖులు

యువగళం పాదయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొని యువనేతకు సంఘీభావం తెలిపారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, అమర్ నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు యువనేతకు సంఘీభావంగా కొంతసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

రాష్ట్రానికి జగనోరా వైరస్ పట్టింది!

గుమ్మయ్యగారిపల్లిలో లోకేశ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఈ సందర్భంగా లోకేశ్ ప్రసంగిస్తూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. "వైసీపీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలంతా అంటున్నది ఒకటే ఆయన జగన్ కాదు రాష్ట్రానికి పట్టిన జగనోరా. కరోనా కంటే జగనోరా వైరస్ రాష్ట్రానికి ప్రమాదం అని అంటున్నారు. ఈ మాట నేను అనడం లేదు వైసీపీ ఎమ్మెల్యేలే అంటున్నారు. 

జగనోరా వైరస్ రాష్ట్రానికి ఎంత ప్రమాదమో మీరంతా తెలుసుకోవాలి. జాబ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న రాష్ట్రాన్ని జగనోరా వైరస్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసింది. ఆఖరికి తిరుమల వెంకన్న సన్నిధిలో గంజాయి అమ్ముతున్నారు. వైసీపీ నాయకులు వ్యవసాయం మానేసి గంజాయి పొలాల్లో పండిస్తున్నారు. నిన్నే గురజాలలో వైసీపీ నాయకుడి పొలంలో గంజాయి పండిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. 

యువత భవిష్యత్ తో జగన్ ఆటలు!

యువత భవిష్యత్తు తో జగనోరా ఆటలాడుతున్నాడని లోకేశ్ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డీఎస్సీ లేదు అని విమర్శించారు. 

"అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జీవో 77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం రద్దు చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరులో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం" అని హామీ ఇచ్చారు.

లోకేశ్ ను కలిసిన వడ్డెర సామాజికవర్గీయులు

పెనుకొండ నియోజకవర్గం చలమయ్యగారిపల్లిలో వడ్డెర సామాజిక వర్గీయులు నారా లోకేశ్ ను కలసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. "టీడీపీ అధికారంలోకి వచ్చాక మాకు పక్కా ఇళ్లు నిర్మించి, పథకాలు అందించండి. వృత్తి పని చేసుకునేందుకు సబ్సిడీ రుణాలు, క్వారీలు కేటాయించి ఆదుకోండి" అని కోరారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో వడ్డెర్లతోపాటు అన్నిరకాల వెనుకబడిన కులాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. "వడ్డెర్ల వృత్తిపని చేసుకునేందుకు గతంలో కేటాయించిన క్వారీలను వైసీపీ నేతలు కబ్జా చేశారు. కుర్చీల్లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్లులేని వడ్డెర్లకు పక్కా గృహాలు నిర్మిస్తాం. గతంలో వడ్డెర్లకు కేటాయించి అన్యాక్రాంతమైన క్వారీలను తిరిగి వారికి అప్పగించేలా చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ పథకం కింద వడ్డెర్లకు పనులు కేటాయిస్తాం. వడ్డెర్లకు పెద్దఎత్తున సబ్సిడీ రుణాలు అందజేసి సొంతకాళ్లపై నిలబడేలా చేస్తాం" అని భరోసా ఇచ్చారు. 

లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించిన నాయీ బ్రాహ్మణులు

పెనుకొండ నియోజకవర్గం జీనబండ్లపల్లిలో గోరంట్ల మండల నాయీ బ్రాహ్మణులు లోకేశ్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. క్షౌర వృత్తిదారులు, వాయిద్య కళాకారులకు ప్రమాద బీమాసౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. "50 సంవత్సరాలు దాటిన నాయీ బ్రాహ్మణులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. శాసనమండలిలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలి. క్షౌర వృత్తిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణ సౌకర్యం కల్పించాలి. దేవస్థానాల పాలకవర్గాల్లో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలి" అని కోరారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల జీవనాధారమైన బార్బర్ షాపులపై కూడా జగన్మోహన్ రెడ్డి వివిధ రకాల పన్నుల భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక క్షౌర వృత్తిదారులు, వాయిద్య కళాకారులకు చంద్రన్న బీమా పథకం కింద రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తాం. నాయీ బ్రాహ్మణులకు శాసనమండలిలో అవకాశం కల్పిస్తాం. క్షౌరవృత్తిదారులకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందజేస్తాం" అని హామీ ఇచ్చారు. 

====

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 661.4 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 11.3 కి.మీ.*

*53వ రోజు (28-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*

*పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

9.00 – గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – బాలన్నగారిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

10,20 – మల్లపల్లిలో ఇటుక తయారీ కార్మికులతో భేటీ.

మధ్యాహ్నం 

12.30 – పాలసముద్రం క్రాస్ వద్ద బీసీలతో ముఖాముఖి.

1.30 – పాలసముద్రం క్రాస్ వద్ద భోజన విరామం.

2.30 – పాలసముద్రం క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

2.35 – పాలసముద్రం క్రాస్ వద్ద లాయర్లతో సమావేశం.

2.55 – బెల్లాలచెరువు వద్ద స్థానికులతో మాటామంతీ.

సాయంత్రం

3.30 – మిషన్ తండా వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.

4.25 – ఎస్ఎల్ఎపి కంపెనీ వద్ద స్థానికులతో మాటామంతీ.

6.15 – గుడిపల్లిలో స్థానికులతో మాటామంతీ.

6.50 – నల్లగొండ్రాయనిపల్లి వద్ద యాదవ సామాజికవర్గీయులతో భేటీ.

7.15 – నల్లగొండ్రాయనిపల్లి విడిది కేంద్రంలో బస.

********

More Telugu News