Nara Lokesh: ​అధికారంలోకి వస్తే పాత రీయింబర్స్ మెంట్ విధానాన్ని అమలు చేస్తాం: లోకేశ్​

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • పాదయాత్రకు నేడు 44వ రోజు
  • తంబళ్లపల్లె నియోజకవర్గంలో లోకేశ్ కు అపూర్వ జనాదరణ
  • సీఎం జగన్, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిపై లోకేశ్ విమర్శనాస్త్రాలు
Lokesh Yuvagalam continues in Tamballapalle constituency

తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 44వ రోజు యువగళం పాదయాత్ర గురువారం బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. తొలుత అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నీరాజనాలు అర్పించారు. అనంతరం సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంలో భాగంగా అభిమానులతో ఫొటోలు దిగారు.

ఆర్థిక ఉగ్రవాదిని చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా?

వేలకోట్ల కుంభకోణాలకు పాల్పడి జైలుకెళ్లిన ఆర్ధిక ఉగ్రవాదిని చూసి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రాష్ట్రానికి వస్తారు? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. కోడి గుడ్డు కథలు చెప్పే మంత్రిని చూసి ఎవరు వస్తారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో వచ్చిన ఒక్క పరిశ్రమ చూపించమని సవాల్ విసిరారు. టీడీపీ తెచ్చిన కంపెనీలకి రిబ్బన్ కటింగ్ చెయ్యడం తప్ప మీరు తెచ్చిన కంపెనీ ఒక్కటి అయినా ఉందా అంటూ లోకేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.  

"వైసీపీ పాలనలో ఎక్కువ నష్టపోయింది ఏపీ యువతే. నాలుగేళ్లు ఇంట్లో పడుకొని ఇప్పుడు సమ్మిట్ అంటూ నాటకాలు ఆడుతున్నారు. కమిషన్ల కోసం ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేశారు జగన్. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు, 40 వేల కంపెనీలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వం శాసనసభ సాక్షిగా అంగీకరించింది" అని స్పష్టం చేశారు. యువతీయువకులతో సమావేశం సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2025లో జాబ్ క్యాలెండర్ ఇస్తాం!

టీడీపీ అధికారంలోకి వచ్చాక 2025 జనవరిలో జాబ్ కేలండర్ తీసుకొస్తామని, ఆ బాధ్యత తానే తీసుకుంటానని లోకేశ్ స్పష్టం చేశారు. "లోన్లు, సబ్సీడీలు అందించి స్వయం ఉపాధిని మేము కల్పిస్తాం. పక్క రాష్ట్రాల్లో జాబ్ లు చేయాలని ఆలోచించడం కాదు. మీరే ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలి. మేము మీకు అండగా ఉంటాం... పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం. యువతను టీడీపీలో రాజకీయంగా ప్రోత్సహిస్తాం. వ్యవసాయం, అనుబంధ రంగాల పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహిస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తాం" అని వ్యాఖ్యానించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్ధరిస్తాం

వైసీపీ పాలనలో 190 డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు నాలుగేళ్లలో మూతబడ్డాయని లోకేశ్ వెల్లడించారు. "విదేశీ విద్యను రద్దు చేశారు. ఎన్నికల ముందు జగన్ కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా దీవెన, వసతి దీవెన అంటూ మోసం చేశారు. గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా నేరుగా కాలేజీలకు ఫీజు చెల్లించి తల్లిదండ్రులుపై ఎటువంటి భారం లేకుండా చేసాం. ఇప్పుడు అరకొరగా డబ్బులు వేసి తల్లిదండ్రులపై సుమారుగా లక్ష రూపాయిలు భారం పడేలా చేశారు. టీడీపీ గెలిచిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేస్తాం" అని భరోసా ఇచ్చారు.

బెయిల్ పైనే బతుకుతున్న జగన్!

గతంలో జగన్ వలన ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళారని లోకేశ్ తెలిపారు. ఈ సారి జగన్ తనతో పాటు కొంత మంది ఐపీఎస్ అధికారులను కూడా జైలుకి తీసుకెళ్లబోతున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"బెయిల్ తీసుకొని బ్రతికే బ్యాచ్ జగన్ రెడ్డి. ఇప్పటికీ జగన్ బెయిల్ పైనే బ్రతుకుతున్నారు. కోర్టుకు వెళ్లి అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు తెచ్చుకునే వాళ్ళు కూడా మాకు నీతులు చెబుతున్నారు. దమ్ము, ధైర్యంతో ప్రజల్లో తిరుగుతున్నా మేము ఏం చేశామో చెబుతున్నా. మీకు సత్తా ఉంటే ఏం పీకారో చెప్పండి. తండ్రితో సమానం అయిన బాబాయ్ ని లేపేసిన వాళ్ళు మాకు నీతులు చెబుతున్నారు. చెల్లికి న్యాయం చెయ్యలేని జగన్ రాష్ట్రంలోని యువతకు న్యాయం చేస్తానంటూ చెవిలో పువ్వు పెడుతున్నాడు"  అని విమర్శించారు.

లోకేశ్ మాటల తూటాలు...

  • తంబళ్లపల్లిలో ఉద్యోగాలు రావాలంటే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించాల్సిందే. ఆ ఒక్క కటుంబం వల్లే పుంగనూరు, తంబళ్లపల్లికి పరిశ్రమలు రావడం లేదు. పెట్టుబడులు పెట్టే వారిని వాటాలు అడగబట్టే పరిశ్రమలు పెట్టడం లేదు. 
  • పార్లమెంట్ లో ఎంపీ మిథున్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక్క కంపెనీ అయినా తెచ్చారా? వాళ్ళ సొంత కంపెనీ అభివృద్ది తప్ప నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం ఇప్పించలేదు. ఎంపీగా ఒక్క పరిశ్రమైనా తెచ్చాడా? కనీసం ప్రత్యేక హోదా గురించి కూడా అడగడం లేదు.
  • చిత్తూరు జిల్లాను పెద్దిరెడ్డి కుటుంబం అఢ్డంగా దోచేస్తోంది. పాపాల పెద్దిరెడ్డి కుటుంబానికే అన్ని ఉద్యోగాలున్నాయి. నామినేటెడ్ పోస్టులు, టెండర్లు, ఎర్రచందనం బండ్లు కూడా వాళ్లవే. కర్ణాటక నుండి రోజూ 50 వేల లీటర్లు డీజిల్ ను ద్వారకానాథ్ రెడ్డి తెస్తున్నాడు. డీజిల్ దొంగ రవాణాతో రోజూ రూ.ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు.
  • ఈ జిల్లాలో ఏ క్వారీ, టిప్పర్, క్రషర్ మిషన్లు చూసినా పీఎల్ఆర్ అని ఉంటుంది. ఈ జిల్లాలో వాళ్లే పనులు చేయాలా? మీ డబ్బులు పది వేల కోట్లు దోచుకున్నారు. ఆధారాలతో నేను నిరూపిస్తా.
  • టీడీపీ వచ్చిన మొదటి ఏడాదిలోనే బి.కొత్తకోటలో డిగ్రీ కళాశాల పూర్తి చేస్తాం. పాపాల పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడిస్తే ఇక్కడికి పరిశ్రమలు తెస్తా. ఆ బాధ్యత నేను తీసుకుంటా. అవసరమైతే నా మాటల్ని రికార్డు చేసుకోండి.
  • ఓట్లకోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఆ తర్వాత మాటతప్పి మడమతిప్పడం జగన్మోహన్ రెడ్డి నైజం. బుడుగ, బేడజంగాల సమస్యపై అధ్యయన కమిటీ నివేదిక పరిశీలించి న్యాయం చేస్తాం. బుడుగ, బేడజంగాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సబ్సిడీ రుణాలు అందిస్తాం. చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 565.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.3 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 45వ రోజు షెడ్యూల్ (17-3-2023)*

*తంబళ్లపల్లి నియోజకవర్గం*

ఉదయం

9.00 – కమ్మపల్లి (పులికల్లు పంచాయితీ) నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.20 – పులికల్లులో స్థానికులతో సమావేశం.

మధ్యాహ్నం

12.15 – ములకలచెరువు టీటీడీ కళ్యాణమండపం వద్ద భోజన విరామం.

సాయంత్రం

3.15 – ములకలచెరువు టీటీడీ కళ్యాణమండపం నుంచి పాదయాత్ర కొనసాగింపు.

3.25 – ములకలచెరువు సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.

4.00 – ములకలచెరువు బహిరంగసభలో యువనేత లోకేశ్ ప్రసంగం.

5.30 – శ్రీ సత్యసాయిజిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.

7.00 – కదిరి నియోజకవర్గం చీకటిమానుపల్లి విడిది కేంద్రంలో బస.


More Telugu News