Nara Lokesh: నిబంధనలు లేకుండా దుల్హన్ అమలు చేస్తామన్న లోకేశ్.. ఈనాటి పాదయాత్ర వివరాలు

  • 43వ రోజును పూర్తి చేసుకున్న పాదయాత్ర
  • లోకేశ్ కు సంఘీభావం ప్రకటించిన మాజీ జడ్జి రామకృష్ణ
  • చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అన్న లోకేశ్
Lokesh Padayatra

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 43వ రోజును పూర్తి చేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. ఈ ఉదయం గుట్టపాలెం విడిది కేంద్రం నుంచి పాదయాత్ర మొదలయింది. బి.కొత్తకోటలో లోకేశ్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ జడ్జి రామకృష్ణ లోకేశ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలను కట్ చేయడం దారుణమని అన్నారు. జగన్ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కొట్టేస్తాడని విమర్శించారు. చెత్తపై పన్ను వేసిన ప్రభుత్వం చెత్త ప్రభుత్వం కాకపోతే ఏమవుతుందని ఎద్దేవా చేశారు. 


'ఏపీలో ఎప్పుడూ లేనంతగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. ముస్లింలపై దాడులు చేసిన ఎవర్నీ వదలను. ముస్లిం రిజర్వేషన్ల కోసం టీడీపీ పోరాడుతోంది. చిన్నాన్నను చంపిన వ్యక్తి తరపున ప్రభుత్వ లాయర్లను పెడుతున్నారు. కానీ ముస్లిం రిజర్వేషన్ల కోసం మాత్రం ఈ సీఎం పోరాడటం లేదు. అమ్మ ఒడి, పెన్షన్లు కూడా ముస్లిం సంక్షేమంలో చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మైనారిటీ కార్పొరేషన్ బలోపేతం చేస్తాం. దుల్హన్ కింద రూ.50 వేలు మేము ఇచ్చాం. కానీ జగన్ లక్ష ఇస్తా అని మోసం చేశారు. ఇప్పుడు ఏకంగా నాలుగేళ్ల తర్వాత దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టి కఠిన నిబంధనలు పెట్టారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి నిబంధనలు లేకుండా పేదలకు దుల్హన్ అమలు చేస్తాం' అని లోకేశ్ హామీ ఇచ్చారు.


యువగళం పాదయాత్ర 44వ రోజు షెడ్యూల్
ఉదయం
8.00  –బి.కొత్తకోట ఇందిరమ్మకాలనీ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – మల్లెల క్రాస్ వద్ద తంబళ్లపల్లి మండలవాసులతో సమావేశం.
8.55 – టి.సదుం క్రాస్ వద్ద స్థానికులతో భేటీ.
11.35 – సొన్నువారిపల్లి వద్ద స్థానికులతో మాటామంతీ.
11.55 – పెదతిప్ప సముద్రం వద్ద స్థానికులతో మాటామంతీ.
12.45 –  మద్దయ్యగారిపల్లి శివారు శ్రీవిజయగణపతి ఫంక్షన్ హాలులో యువతతో ముఖాముఖి. 
1.45 – మద్దయ్యగారిపల్లి శివారు శ్రీ విజయగణపతి ఫంక్షన్ హాలులో భోజన విరామం.
సాయంత్రం
3.00 – భోజన విరామస్థలంలో పంచాయితీ సర్పంచులతో సమావేశం.
4.00 – పార్టీలో చేరికలు, అనంతరం పాదయాత్ర కొనసాగింపు.
4.40 – మద్దయ్యగారిపల్లిలో స్థానికులతో మాటామంతీ.
6.15 – కొమ్మరపల్లి విడిది కేంద్రంలో బస.

More Telugu News