Nara Lokesh: మేం గెలిచినా సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తాం: నారా లోకేశ్

  • పీలేరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • 36వ రోజు కొనసాగిన పాదయాత్ర
  • లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
  • సాదరంగా ఆహ్వానించిన లోకేశ్
  • ప్రెస్ మీట్ నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
Nara Lokesh press meet high lights

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 36వ రోజు (సోమవారం) పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో కొనసాగింది. పీలేరు నియోజకవర్గంలో వరుసగా రెండోరోజు కూడా యువనేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

ఇక, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో వైసీపీ నాయకుడు, కలికిరి సర్పంచ్ ఆర్. ప్రతాప్ రెడ్డి, మహాల్ మాజీ సర్పంచ్ వై. సతీష్ రెడ్డి, ఎనుగొండపాలెం మాజీ ఎంపీటీసీ ఏ. శ్రీనివాసులు నాయుడుతో సహా 1500 కుటుంబాలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరాయి. లోకేశ్ వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

 నిన్న చెప్పినట్టు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెట్టుబడుల వ్యవహారంపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.

  • ఏ ప్రభుత్వం అయినా ఒప్పందాలు జరిగినప్పుడు వాటిని బహిరంగంగా అధికారికంగా ప్రకటిస్తారు, కానీ వైసీపీ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన సమ్మిట్ కు సంబంధించి ఒప్పందాల పుస్తకాలు, సంతకాలు చూపించడం లేదు... అందుకే అది లోకల్ ఫేక్ సమ్మిట్ అంటున్నాను.
  •  కాగితాలు లేని ఎంఓయూలు మార్చుకున్నారు. 378 ఎంఓయూలు జరిగితే 70 కంపెనీల పేర్లు మాత్రమే బయటపెట్టారు. చంద్రబాబు పాలనలో ఆన్ లైన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు దానిలో చూపించేవాళ్లం.
  • ఇండోసోల్ అనే కంపెనీ డైరెక్టర్లు అందరూ పులివెందులకు చెందిన వారు. 2022లో కంపెనీగా వచ్చింది. అది జగన్ రెడ్డి బినామీ కంపెనీ. మూలధన పెట్టుబడి లక్ష మాత్రమే. ఇటువంటి కంపెనీ రూ.76 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పింది. ఎలా నమ్మాలి?
  • ఇక, భారతదేశం మొత్తమ్మీద అత్యధిక విద్యుత్ వాడకం 2.5లక్షల మెగావాట్లు మాత్రమే. 2022 జూన్ లెక్కల ప్రకారం ఏపీలో అత్యధిక విద్యుత్ వాడకం 11,448మెగావాట్లు మాత్రమే. వాస్తవం ఇలా ఉండగా ఒక్క సోలార్ ఎనర్జీ లోనే 2లక్షల మెగావాట్లు ఉత్పత్తిచేసే పరిశ్రమలు తెస్తామని రాష్ట్ర ప్రజలను జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోంది. ఇది నమ్మశక్యమేనా?
  • దావోస్ కు 12 కోట్లు ఖర్చు పెట్టి జగన్ రెడ్డి చాలా పెద్ద విమానాన్ని తీసుకుని వెళ్లి ఒప్పందాలు అరబిందో, గ్రీన్ కో, అదానీ కంపెనీలతో మాత్రమే చేసుకుని వచ్చారు. ఇవే ఒప్పందాలను ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు తీసుకొచ్చి పదేపదే మూడు సార్లు ఒప్పందాలను జగన్ రెడ్డి చూపించి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. 
  • టీడీపీ హయాంలో అనంతపురం జిల్లాకు కియా, బర్జర్ పెయింట్స్, జాకీ పరిశ్రమలు తెచ్చాం. కడపకు వెల్ స్పన్ కంపెనీని తీసుకొచ్చాం. చిత్తూరుకు అనేక మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువచ్చాం. వీటిలో టీసీఎల్, సెల్ కాన్, మైక్రోమ్యాక్స్, ఫాక్స్ కాన్, డిక్సన్ కంపెనీలు ఉన్నాయి. 
  • కర్నూలుకు సిమెంట్ కంపెనీలు, సోలార్ ఉత్పత్తి కేంద్రాలు తీసుకువచ్చాం. నెల్లూరుకు హీరో మోటార్స్, అపోలో టైర్స్, సుజల వంటి వందలాది పరిశ్రమలు తెచ్చాం. ప్రకాశంలో ఏషియన్ పేపర్ మిల్స్, గుంటూరు, కృష్ణాకు అశోక్ లేల్యాండ్, కేసీపీ, హెచ్.సీ.ఎల్, ఉభయగోదావరిలో అనేక ఫిషరీస్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తెచ్చాం. 
  • విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్ తో ఒప్పందం, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాంజియెంట్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు తెచ్చాం.

విలేకరుల ప్రశ్నలకు లోకేశ్ సమాధాలు ఇవిగో...

ప్రశ్న: మీరు ఇది ఫేక్ సమ్మిట్ అంటున్నారు... నిజమేనా? జగన్ రెడ్డి 25వేల ఎకరాలు దోచేస్తున్నారని అంటున్నారు. మీ వద్ద ఆధారాలున్నాయా?

సమాధానం: కచ్చితంగా ఇది లోకల్ ఫేక్ సమ్మిట్ మాత్రమే. ఇండోసోల్ కంపెనీ జగన్ బినామీలది. వాళ్లను అడ్డుపెట్టి భూములు దోచేసేందుకు పెద్దకుట్ర జరుగుతోంది.

ప్రశ్న: సరస్వతీ సిమెంట్స్ పేరుతో ప్రభుత్వం భూములు తీసుకుంది. నేటికీ పరిశ్రమ రాలేదు. అసలు కంపెనీ ప్రారంభం అవుతుందా?

సమాధానం: వైసీపీ అధికారంలోకి వచ్చాక బాగుపడింది కేవలం జగన్ రెడ్డి పరిశ్రమలే. ఈ మూడున్నరేళ్లలో భారతీ సిమెంట్స్ కు రూ.850 కోట్ల లాభాలు వచ్చాయి. మిగతా కంపెనీలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. కొన్ని పక్క రాష్ట్రాలకు పారిపోయాయి.

ప్రశ్న: టీడీపీ, జనసేన 175 నియోజజవర్గాల్లో ఎందుకు ఒంటరిగా పోటీ చేయడం లేదు? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. మీరు ఏమంటారు?

సమాధానం: జగన్ రెడ్డికి అంత భయం ఎందుకు? టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని మేం ఎక్కడైనా చెప్పామా? వాళ్లు మేం ఎక్కడ పోటీచేయాలో నిర్ణయిస్తే మేం పోటీ చేయాలా? ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తాం. టీడీపీ, జనసేన మైత్రిని చూసి జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు?

ప్రశ్న: వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా సంవత్సరానికి లక్ష ఆదాయం వస్తోంది. టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వం అంటోంది. మీరు ఎలా చూస్తారు?

సమాధానం: 100 సంక్షేమాలు కట్ చేసిన ప్రభుత్వం జగన్ రెడ్డిది. దానిపై చర్చకు నేను సిద్ధం. జగన్ రెడ్డి నాతో చర్చకు సిద్ధమా?

ప్రశ్న: మీరు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు రద్దు చేస్తారా?

సమాధానం: చంద్రబాబు పాలనలో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు దేన్నీ రద్దు చేయలేదు. ఆరోగ్యశ్రీని రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. మేం దాన్ని కొనసాగించాం. జగన్ రెడ్డి మేం అమలు చేసిన పథకాలను పూర్తిగా రద్దు చేశాడు. 

ప్రశ్న: సచివాలయ ఉద్యోగులను మీరు వచ్చాక తొలగిస్తారా? కొనసాగిస్తారా?

సమాధానం: జగన్ రెడ్డిలా అబద్దాలు చెప్పడం మాకు రాదు. బాబాయ్ ని చంపి ఆ నేరాన్ని మాపై నెట్టేశారు. మేం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తాం.

ప్రశ్న: సర్పంచ్ గా కూడా గెలవని వ్యక్తి పాదయాత్ర చేస్తుంటే ప్రజలు ఎలా సహకరిస్తారు? ఇది టీడీపీకి శవయాత్ర అంటూ అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దానికి మీరు ఏమంటారు?

సమాధానం: టీడీపీ ఓడిపోతున్న నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటలా మార్చేందుకు నేను మంగళగిరిని ఎంచుకున్నా. జగన్ రెడ్డిలా కుటుంబం ఓట్లు ఉన్న చోట పోటీ చేయలేదు. జగన్ రెడ్డికి దమ్ముంటే వైసీపీ గెలవని ప్రాంతంలో పోటీ చేసి గెలవమనండి చూద్దాం. నేను ఛాలెంజ్ విసురుతున్నా.

ప్రశ్న: వైసీపీలో సీట్లపై స్పష్టత ఉంది. మీ పార్టీలో ఆ స్పష్టత కరువైంది. దీనికి మీ సమాధానం?

సమాధానం: వైసీపీలోనే సీట్లపై ఎటువంటి స్పష్టత లేదు. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. వైసీపీకి నెల్లూరులో పరిస్థితులను మనం చూశాం. భవిష్యత్తులోనూ మనం ఇంకా చూస్తాం.

ప్రశ్న: రాజధాని విషయంలో ప్రజలకు ఎటువంటి స్పష్టత లేదు. రాష్ట్రం పరిస్థితి ఏంటి?

సమాధానం: రాజధానిపై కేంద్రం ఒక మాట, రాష్ట్రం ఒక మాట చెబుతోంది. మూడు రాజధానులు అని చెప్పిన సీఎం ఎక్కడా ఒక ఇటుక కూడా పెట్టలేదు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా? అమెరికా లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఆఫ్రికాలో 30 శాతం నిరుద్యోగం ఉంది. ఏపీని కూడా జగన్ రెడ్డి అదే మార్గంలో తీసుకెళుతున్నాడు.


యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 472.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 14.2 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 37వ రోజు షెడ్యూల్(7-3-2023)*

*పీలేరు నియోజకవర్గం*

ఉదయం

8.00 – కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రంలో మైనారిటీలతో ముఖాముఖి.

9.00 – ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.30 – కలికిరి జెఎన్ టియు వద్ద విద్యార్థులతో మాటామంతీ.

11.30 – వాయల్పాడు మండలం వాండ్లపల్లి వద్ద భోజన విరామం.

మధ్యాహ్నం

1.30 – భోజన విరామ స్థలంలో రైతులతో ముఖాముఖి.

సాయంత్రం

3.15 – గంధబోయినపల్లిలో గ్రామస్థులతో మాటామంతీ.

3.45 – బీదవారిపల్లిలో స్థానికులతో భేటీ.

5.00 – చింతపర్తిలతో ఎస్టీలతో సమావేశం.

6.00 – బోయపల్లి క్రాస్ వద్ద చింతపర్తి విడిది కేంద్రంలో బస.

More Telugu News