Nara Lokesh: చంద్రబాబును గెలిపించి ఉంటే గ్రావిటీ ద్వారా సీమకు నీళ్లు వచ్చేవి: లోకేశ్

  • చంద్రగిరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • కొండేపల్లి క్రాస్ వద్ద మామిడిరైతులతో భేటీ
  • మోసగాడు ఎప్పుడూ మోసమే చేస్తాడని వ్యాఖ్యలు
  • చంద్రబాబు గెలిస్తే పోలవరం పూర్తయ్యేదని వెల్లడి
Lokesh talks with Mango farmers at Kondepalli Cross

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం కొండేపల్లి క్రాస్ వద్ద మామిడి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ... గత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి ఉంటే ఈపాటికి పోలవరం పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. గ్రావిటీ ద్వారా రాయలసీమకు నీళ్లు వచ్చేవని స్పష్టం చేశారు. 

టీడీపీ హయాంలో హంద్రీనీవా పనులు 90 శాతం పూర్తి చేసినా, ఈ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేకపోతోందని లోకేశ్ విమర్శించారు. లక్ష కోట్లు దొబ్బి 16 నెలలు జైల్లో ఉన్న మోసగాడు ఎప్పుడూ మోసమే చేస్తాడని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా లోకేశ్ దళితులకు సంబంధించిన అంశాలపైనా స్పందించారు. దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే దళితుల భూములు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. డీకేటీ భూములపై హక్కులు కల్పిస్తామని తెలిపారు. 

కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని వెల్లడించారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News