Advertisement

కేంద్రంతో సీజేపీ చర్చలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు గడువు కోరిన ప్రభుత్వం

Dharmendra Pradhan resignation CJP talks with Center seek time till tomorrow
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టు వీడ‌ని సీజేపీ
  • రేపు మధ్యాహ్నం వరకు గడువు కోరిన కేంద్ర ప్రభుత్వం
  • పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడానికి సూత్రప్రాయ అంగీకారం
  • డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ స్పష్టీకరణ
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ఆయన్ను బర్తరఫ్ చేయాలని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) డిమాండ్ చేసింది. నీట్ పరీక్షల వివాదంపై కేంద్ర ప్రభుత్వంతో రెండో విడత చర్చలు ముగిసిన అనంతరం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మంత్రి రాజీనామా డిమాండ్‌పై స్పందించేందుకు కేంద్రం రేపు మధ్యాహ్నం వరకు గడువు కోరిందని, అప్పటివరకు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది.

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇవాళ‌ మధ్యాహ్నం కీలక చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హాజరుకాగా, సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా పాల్గొన్నారు. 

సమావేశం అనంతరం సీజేపీ నేత అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై ప్రభుత్వం రేపటి మధ్యాహ్నం వరకు సమయం కోరింది. ఆయన్ను త్వరలోనే తొలగిస్తారని ఆశిస్తున్నాం. పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లు, కేసులు ఉపసంహరించుకోవాలనే మా డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది" అని వివరించారు.

శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, బాధితుల కుటుంబాలకు తగిన పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సీజేపీ చర్చలకు అంగీకరించింది. చర్చలకు ముందే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు.

సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీపై మంత్రి జేపీ నడ్డా స్పందించారు. "వారు మూడు ప్రధాన డిమాండ్లు, పరీక్షల సంస్కరణలకు సంబంధించి ఐదు సూచనలు చేశారు. ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించి, రేపు మధ్యాహ్నం మరోసారి సమావేశమై మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పాం" అని ఆయన అన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న‌ రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు, కేసుల సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ పరిశీలిస్తుందని ప్రకటించారు. "ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నేను ఇప్పటికే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశాను" అని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ హామీలతో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించిన విషయం తెలిసిందే.
Advertisement
Dharmendra Pradhan
NEET Exam Controversy
Cockroach Janata Party
JP Nadda
Narendra Modi
Student Protests

More Telugu News